సంపద పునఃపంపిణీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీకి జైరాం రమేష్ సవాల్

by Dishanational1 |
సంపద పునఃపంపిణీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీకి జైరాం రమేష్ సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: 'సంపద పునఃపంపిణీ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో దాని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని అన్నారు. మా మేనిఫెస్టోలో సంపద పునఃపంపిణి గురించి పొందుపరిచామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారని, మా 50 పేజీల మేనిఫెస్టోలో దాని గురించి ఒక్క పదం కూడా లేదని, ఉంటే నిరూపించాలని మోడీకి నేను సవాలు చేస్తున్నాను' అంటూ విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో, విధానాలలో తగిన మార్పుల ద్వారా సంపద, ఆదాయంలో పెరుగుతున్న అసమానతలను పరిష్కరిస్తామని పేర్కొందన్నారు. 'వేగవంతమైన వృద్ధికి, సంపద సృష్టికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని మేనిఫెస్టోలో చెప్పామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన నేపథ్యంలో వారసత్వ పన్నుపై కూడా కాంగ్రెస్ వైఖరిపై ఆయన స్పష్టత ఇచ్చారు. వారసతర్వ పన్ను గురించి తమ మేనిఫెస్టోలో ఎలాంటి ప్రస్తావన లేదు. అది మా ఎజెండా కాదు. నిజానికి 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీయే వారసత్వ పన్నును రద్దు చేసినట్టు గుర్తుచేశారు.

ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టిన జైరాం రమేష్.. బీజేపీ కష్టాల్లో కూరుకుపోయిందని, ప్రధాని అయోమయంలో పడ్డారని అన్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ జరిగినప్పటి నుంచి మోడీ మొత్తం అజెండాను వేరే దారిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 'మా మేనిఫెస్టోకు మతపరమైన రంగు పులిమేందుకు ప్రయత్నించారు, ఆ తర్వాత మా మేనిఫెస్టోలో లేని కొన్ని అంశాలను లేవనెత్తారు. మోడీ తన ఎన్నికల ర్యాలీలలో మా మేనిఫెస్టోను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అయినప్పటికీ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాల మేనిఫెస్టోను ప్రధానమంత్రి ప్రచారం చేయడం ఇదే మొదటిసారి' అని జైరాం రమేష్ వెల్లడించారు.



Next Story

Most Viewed