- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
India's Richest MLA : దేశంలోనే సంపన్న ఎమ్మెల్యే దగ్గర రూ.3,400 కోట్ల ఆస్తులు

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్ల ఆస్తులున్నాయని.. పేద ఎమ్మెల్యే దగ్గర రూ1,700 మాత్రమే ఉన్నాయని తెలిపింది. అయితే, ధనిక, పేద ఎమ్మెల్యేలు ఇద్దరూ బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు ఎన్నికల అఫిడవిట్ లో దాఖలు చేసిన వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సేకరించింది. వారి ఆర్థిక వివరాలను వెల్లడించింది. ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత పరాగ్ షా సుమారు రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే. అయితే పశ్చిమ బెంగాల్లోని సింధుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద ఎమ్మెల్యే. ఆయన ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే. మరోవైపు టాప్ టెన్ సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. టాప్ 20 జాబితాలో ఏపీ నుంచే ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.931 కోట్లు కాగా, మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు రూ.757 కోట్లు. టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి పీ నారాయణ ఆస్తులు రూ. 824 కోట్లు, మరో టీడీపీ ఎమ్మెల్యే వి ప్రశాంతి రెడ్డికి రూ.716 కోట్ల ఆస్తులున్నాయి. వీరు టాప్ టెన్ లో ఉండగా.. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాప్ 20 జాబితాలో ఉన్నారు.
కర్ణాటక ఎమ్మెల్యేల దగ్గరే..
కాగా, రాష్ట్రాల వారీగా కర్ణాటక ఎమ్మెల్యేల (223 మంది సభ్యులు) సగటు సంపద రూ.14,179 కోట్లతో తొలి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు (286 మంది సభ్యులు) రూ.12,424 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల (174 మంది సభ్యులు) మొత్తం సంపద రూ.11,323 కోట్లు. మరోవైపు అత్యల్ప ఆస్తులున్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. ఆ రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ. 90 కోట్లు, మణిపూర్ ఎమ్మెల్యేలు (59 సభ్యులు) రూ. 222 కోట్లు, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు (30 మంది సభ్యులు) రూ. 297 కోట్లు కలిగి ఉన్నారు. మరోవైపు 28 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.73,348 కోట్లు. 2023-24లో నాగాలాండ్ (రూ. 23,086 కోట్లు), త్రిపుర (రూ. 26,892 కోట్లు), మేఘాలయ (రూ. 22,022 కోట్లు) వార్షిక బడ్జెట్ల మొత్తాన్ని ఇది అధిగమించింది.