Bangladesh: బంగ్లాదేశ్ విదేశాంగ అధికారులతో భారత్ చర్చలు

by Shamantha N |
Bangladesh: బంగ్లాదేశ్ విదేశాంగ అధికారులతో భారత్ చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో చర్చలు జరిపేందుకు భారత కార్యదర్శి విక్రమ్‌ మిశ్రి బంగ్లాదేశ్‌కు వెళ్లారు. ఇక ఈ పర్యటనలో భాగంగానే మిశ్రి బంగ్లాదేశ్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్‌ తౌహిద్‌ హోస్సానితో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్‌ జషీముద్దీన్‌తో ఆయన కీలక అంశాలను చర్చించారు. బంగ్లాదేశ్ లోని హిందువులు సహా మైనారిటీలపై దాడుల గురించి చర్చించారు. అదే సమయంలో ఆ దేశ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనుస్‌తో కూడా ఫోన్‌ కాల్‌లో మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

వాయుసేన విమానంలో..

కాగా.. సోమవారం ఉదయం భారత వాయుసేన విమానంలో విక్రమ్‌ ఢాకా చేరుకొన్నారు. బంగ్లాదేశ్‌లో ఆయనకు విదేశాంగ మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి స్వాగతం పలికారు. ఆ తర్వాత మిశ్రి-మహమ్మద్‌ జషీముద్దీన్‌లు చర్చలు జరిపారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుతో పరిస్థితి మరింత దిగజారింది. ఆయనకు న్యాయపరంగా సాయం అందించడంపై కూడా ఆందోళనలు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో మిశ్రి పర్యటన ఆసక్తికరంగా మారింది.

Next Story