దేశ వ్యాప్తంగా కోటి ఉద్యోగాలు..బిహార్‌కు ప్రత్యేక హోదా: ఆర్జేడీ మేనిఫెస్టో రిలీజ్

by samatah |
దేశ వ్యాప్తంగా కోటి ఉద్యోగాలు..బిహార్‌కు ప్రత్యేక హోదా: ఆర్జేడీ మేనిఫెస్టో రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు గాను బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తన మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. పరివర్తన్ పాత్ర పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రిలీజ్ చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక రూ.500కే గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని పేర్కొన్నారు. బిహార్‌లో ఐదు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్నియా, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్ రక్సాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు.

బిహార్‌కు ప్రత్యేక హోదా సైతం కల్పిస్తామని స్పష్టం చేశారు. పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను కూడా పునరుద్ధరిస్తామని ఆర్జేడీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడితే 10 పంటలకు ఎంఎస్‌పీ తెస్తామని పేర్కొంది. ఆగస్టు 15వ తేదీ నుంచే దేశంలో ఉద్యోగాల కల్పన ప్రారంభమవుతుందని తేజస్వీ యాదవ్ తెలిపారు. దేశంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ దీని గురించి ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు.

Advertisement

Next Story