సీజేఐని కలిసిన ఆరు బార్ అసోసియేషన్ల ప్రతినిధులు

by John Kora |
సీజేఐని కలిసిన ఆరు బార్ అసోసియేషన్ల ప్రతినిధులు
X

- జస్టిస్ వర్మ బదిలీని ఉపసంహరించుకోవాలి

- ఆయనకు పనులు కేటాయించవద్దు

- బార్ అసోసియేషన్ డిమాండ్

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో నగదు దొరికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆరు బార్ అసోసియేషన్లు నిరసన తెలిపాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంవీవ్ ఖన్నాను కలిసిన బార్ అసోసియేషన్ల ప్రతినిధులు వెంటనే ఆ బదిలీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 'జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీపై మా డిమాండ్‌ను పరిశీలిస్తామని సీజేఐ మాకు హామీ ఇచ్చారు' అని అలహాబాద్ బార్ అసోసియేషన్ చీఫ్ అనిల్ తివారీ అన్నారు. అలహాబాద్ కోర్టుకు బదిలీ అయిన తర్వాత కూడా జస్టిస్ వర్మ నుంచి న్యాయపరమైన పనులు ఉపసంహరించబడతాయని సీజేఐ చెప్పినట్లు బార్ అసోసియేషన్ల చీఫ్‌లు తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వర్మ నివాసం నుంచి నగదు కు్పపను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్‌కు బదిలీ చేశారు. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కూడా వర్మకు కేటాయించిన న్యాయపరమైన పనులను ఉపసంహరించుకుంది. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం అలహాబాద్‌లో బార్ అసోసియేషన్ నిరసనలకు దారి తీసింది. అంతే కాకుండా ఆయా బార్ అసోసియేషన్లు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న న్యాయమూర్తులను తమ వద్దకు బదిలీ చేయడాన్ని సహించబోమని వారు తెలిపారు. అయితే సీజేఐ గురువారం హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మె కొనసాగింపుపై పునరాలోచిస్తామని బార్ అసోసియేషన్లు తెలిపాయి. న్యాయ వ్యవస్థ నుంచి అవినీతి నిర్మూలించాలని, ఈ కేసులో క్రిమినల్ చట్టాన్ని అమలులోకి తీసుకొని రావాలని సీజేఐని కోరుతూ బార్ సంఘాలు మొమొరాండం సమర్పించాయి. మార్చి 14న జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించాయి.

Next Story

Most Viewed