ADR Report : ఆ విషయంలో బీఆర్ఎస్ టాప్.. ఏడీఆర్ సంచలన నివేదిక

by Hajipasha |
ADR Report : ఆ విషయంలో బీఆర్ఎస్ టాప్.. ఏడీఆర్ సంచలన నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మరో సంచలన నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు సమర్పించిన ఆదాయ, వ్యయ నివేదికల ఆధారంగా ఏడీఆర్ సమగ్ర విశ్లేషణ చేసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రాంతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిలిచింది. ఆ సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ. 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానం. ఆ సంవత్సరంలో ఆదాయం విషయంలో బీఆర్ఎస్ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ. 333.45 కోట్లు (19.16 శాతం), డీఎంకే రూ. 214.35 కోట్లు (12.32 శాతం) ఉన్నాయి. టాప్-5 స్థానాల్లో నిలిచిన పార్టీలు మొత్తం రూ.1,541.32 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56 శాతానికి సమానం. 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,740.48 కోట్లు. 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 39 పార్టీలు వివరణాత్మక ఆదాయ, వ్యయ నివేదికలను ఈసీకి సమర్పించాయి.

ఖర్చులుపోనూ ఆదాయం.. ఇందులోనే బీఆర్ఎస్ టాప్

19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులుపోనూ ఆదాయం మిగిలిందని ఈసీకి తెలిపాయి. బీఆర్ఎస్‌ పార్టీకి ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలింది. బిజూ జనతాదళ్‌కు రూ.171.06 కోట్లు, డీఎంకేకు రూ.161.72 కోట్ల మేర ఈవిధమైన ఆదాయం మిగులు దక్కింది. 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని తెలిపాయి. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులే 490.43 శాతం ఎక్కువ జరిగాయని వెల్లడించింది.

ఖర్చుల్లో ఏ పార్టీ ఏ స్థానంలో ఉందంటే..

2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. ఈ పార్టీ ఆ ఏడాదిలో రూ.181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66 శాతానికి సమానం. ఖర్చుల జాబితాలో రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ రూ. 79.32 కోట్లు (16.49 శాతం), మూడో స్థానంలో బీఆర్ఎస్ రూ. 57.47 కోట్లు (11.94 శాతం), నాలుగో స్థానంలో డీఎంకే రూ.52.62 కోట్లు(10.94 శాతం), ఐదో స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ రూ.31.41 కోట్లు(6.53 శాతం) నిలిచాయి. శివసేన షిండే వర్గం, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు సహా 18 ప్రాంతీయ పార్టీల 2022-23 ఆర్థిక సంవత్సర ఆడిట్ నివేదికలు ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ తెలిపింది. ప్రాంతీయ రాజకీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం రూ. 1,522.46 కోట్ల ఆదాయంలో రూ.1,285.83 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించాయి. ఎనిమిది ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను స్వీకరించాయని ఏడీఆర్ పేర్కొంది.



Next Story