భారత నావికాదళానికి కొత్త చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నియామకం

by Dishanational1 |
భారత నావికాదళానికి కొత్త చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళానికి కొత్త చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించిన త్రిపాఠి ప్రస్తుతం నావికాదళ సిబ్బందికి వైస్-చీఫ్‌గా ఉన్నారు. ఈ నెలాఖరు నుంచి కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. 1964, మే నెలలో జన్మించిన ఆయన 1985, జూలై నుంచి భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, కమ్యూనికేషన్‌లో నిపుణుడిగా పేరుతున్న త్రిపాఠి వైస్ చీఫ్ పదవిని చేపట్టడానికి ముందు వెస్టర్న్ నావల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. రేవాలోని సైనిక్‌ స్కూల్‌, ఖడక్వాస్లాలోని ఎన్‌డీయే పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి నావల్ వార్ కాలేజ్ గోవా, యూఎస్‌లోనూ పలు కోర్సులు చేశారు. అతి విశిష్ట్ సేవా మెడల్, నౌసేన మెడల్ వంటి పురస్కారాలను అందుకున్నారు.

Next Story

Most Viewed