56 ఏళ్ల క్రితం కూలిన ఫ్లైట్.. హిమాచల్ ప్రదేశ్ లో మరో 4 మృతదేహాల వెలికితీత

by Y.Nagarani |
56 ఏళ్ల క్రితం కూలిన ఫ్లైట్.. హిమాచల్ ప్రదేశ్ లో మరో 4 మృతదేహాల వెలికితీత
X

దిశ, వెబ్ డెస్క్: సుమారు 56 ఏళ్ల క్రితం 102 మంది భారత వైమానిక దళంతో ప్రయాణిస్తోన్న విమానం హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ పాస్ వద్ద కూలిపోయింది. ఆ ప్రమాదంలో మరణించిన వారిలో మరో నలుగురి మృతదేహాలను భారత సైన్యం తాజాగా వెలికి తీసింది. 1968, ఫిబ్రవరి 7న ఛండీగఢ్ నుంచి AN-12 విమానం బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. దాని ఆచూకీ కోసం వెతుకగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రోహ్ తంగ్ వద్ద కూలిపోయినట్లు గుర్తించారు అధికారులు.

ఆ ప్రాంతమంతా దశాబ్దాల కాలంగా మంచుతో కప్పి ఉండటంతో.. మృతదేహాలను వెలికి తీయడం సవాలుగా మారింది. నాటి నుంచి మృతదేహాల వెలికితీతకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్ పేయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ కు చెందిన పర్వతారోహకులు తొలిసారి అక్కడ శిథిలాలను గుర్తించారు. ఆ తర్వాత భారత సైన్యం 2005, 2006, 2013 లో సెర్చ్ మిషన్స్ నిర్వహించింది. 2019లో డోగ్రా స్కౌట్ల సహాయంతో 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చంద్రభాగ పర్వతం వద్ద మరో నలుగురి మృతదేహాలను వెలికితీయగా.. వారిలో ముగ్గురిని గుర్తించారు. మల్ఖాన్ సింగ్, సిపాయి నారాయణ్ సింగ్, మరో వ్యక్తిని అతని పేబుక్ ద్వారా గుర్తించారు. ఇంకా 93 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed