అది మన సాంప్రదాయం.. మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Minister Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: గ్రామ దేవతల దీవెనలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బోనాల పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కృష్ణా టాకీస్ సమీపంలోని ముత్యాలమ్మ అమ్మవారిని మంత్రి జగదీష్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ‌ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు, ఉత్సవాలు ప్రజల్లో ఐకమత్యం పెంచుతాయన్నారు. ముత్యాలమ్మ పండుగ సందర్భంగా మహిళలు దేవాలయాలకు బోనాలతో పెద్దసంఖ్యలో హాజరు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వాతావరణం మారుతున్న సమయంలో వర్షాల కారణంగా అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

అంతేగాకుండా.. పిల్లపాపలను, కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని గ్రామ దేవతలకు మొక్కి నైవేద్యం సమర్పించడం మన సంప్రదాయమని‌ ఆయన అన్నారు. గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరికీ లభించాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కరోనా ముప్పు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలితఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ సభ్యులు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story