ఓలా కస్టమర్ కేర్ నుంచి అంటూ ప్రైవేట్ ఉద్యోగిణిని..

by Sumithra |
Cyber Crime
X

దిశ, కంటోన్మెంట్ : ఆన్‌లైన్ మోసాలతో అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. ఓలా కస్టమర్ కేర్ సెంటర్ ఉద్యోగినంటూ ఓ అగంతకుడు ప్రైవేట్ ఉద్యోగిణి బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు కాజేశాడు. ఈ సంఘటన బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. సిక్ విలేజ్‌కు చెందిన లక్ష్మి సంధ్య(32) ప్రైవేటు ఉద్యోగిణి. గత నెల 22వ తేదీన ఆమె ఓలా ఆటోలో సికింద్రాబాద్‌లోని శ్రీ గణేశ్ దేవాలయానికి వెళ్లింది. గమ్యస్థానం చేరాక ఆమె సదరు ఆటో డ్రైవరుకు ఆన్‌లైన్ ద్వారా రూ.82 లను చెల్లించింది.

కాగా, అదే నెల 29వ తేదీన మరోసారి ఓలా ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా, ఓలా యాప్‌లో ఆమె 22వ తేదీన రూ.82 లను చెల్లించినట్లుగా తేలింది. దీంతో ఆమె మరో ఆటోలో వెళ్లి పని ముగించుకొని ఇంటికివచ్చింది. గూగుల్‌లో లభించిన ఓలా కస్టమర్ కేర్ నెంబరుకు ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి సమాధానం రాలేదు. ఈ విషయమై ఆమె ఆరా తీస్తుండగా, ఓ అగంతకుడు ఫోన్ లైన్‌లోకి వచ్చి తనను తాను ఓలా కస్టమర్ కేర్ సెంటర్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. సదరు నెంబరు ద్వారా ఆమె మాటలు సరిగా వినిపించడంలేదంటూ అతను మరో నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ చేశాడు. అతడి మాటలను విశ్వసించిన లక్ష్మి సంధ్య తన పూర్తి వివరాలను వెల్లడించింది.

అయినప్పటికీ సదరు నెంబరు నుంచి పలుమార్లు ఆమెకు ఫోన్ వస్తుండడంతో ఆ నెంబరును బ్లాక్ చేసింది. అనంతరం ఆమెకు వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పటికీ ఆమె స్పందించలేదు. ఈ నెల 3వ తేదీన తన ఖాతాలోంచి రూ.10 వేలు డెబిట్ అయినట్లు ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చి ఏటీఎం కేంద్రానికి చేరుకునేలోపే వరుసగా రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.10,330, రూ.8,500 లు ఇలా మొత్తం తన ఖాతాలోంచి రూ.84,490 లు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు మంగళవారం బోయిన్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed