వర్షం మిగిల్చిన నష్టం.. ముగ్గురు గల్లంతు

by  |
వర్షం మిగిల్చిన నష్టం.. ముగ్గురు గల్లంతు
X

దిశ ప్రతినిధి, మెదక్ : నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని తెచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 4,547 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 553 ఇండ్లు కూలిపోయాయి, వాగులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై పారడం, పలు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల కారణంగా భారీ నష్టం ఏర్పడింది. హుస్నాబాద్, నంగునూరు, బెజ్జంకి, కోహెడ, మర్కుక్, గజ్వేల్, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. సిద్దిపేట జిల్లాలో 429 ఇండ్లు వర్షం కారణం‌గా కూలిపోయాయి. 3 వేల 290 ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 2,676 ఎకరాల్లో వరి, 614 ఎకరాల్లో పత్తి పంట నీటి మునిగింది. సిద్దిపేట, వరంగల్ రహదారిలో ఉన్న మోయతుమ్మెద వాగు రెండు మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తాకిడికి రెండ్రోజుల క్రితం బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తున్న లారీ కొట్టుకుపోయింది. లారీతో పాటు డ్రైవర్ సైతం గల్లంతయ్యాడు. చిన్నాకోడూర్, నంగునూర్ మండలాల మధ్య వాగులో ఇన్నోవా కారు, అందులో ప్రయాణిస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి గల్లంతు కాగా, గజ్వేల్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. మెదక్ జిల్లాలో కేవలం 15 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో 124 ఇండ్లు కూలిపోయాయి. జిల్లాలో మొత్తం 1,242 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో 307 ఎకరాలలో పత్తి, 246 ఎకరాలలో సోయాబీన్‌, 102 ఎకరాల్లో చెరుకు, 360 ఎకరాలలో కంది, 200 ఎకరాల్లో పెసర, 17 ఎకరాలలో జోన్న తదితర పంటలు నీట మునిగాయి.

రోడ్లు ధ్వంసం, నిలిచిన రాకపోకలు

భారీ వర్షానికి జిల్లాలోని ఆయా మండలాల పరిధి‌లోని గ్రామాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. కొన్ని చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. దీని కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగేండ్లుగా ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ స్థాని‌క నాయకులు, అధికారులు తాత్కలికంగా మరమ్మతులు చేపడుతున్నారు కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని పలువురు అంటున్నారు. బోన్‌సాయి వెంచర్‌ భవనాలు నిర్మించ‌డం కారణంగా తెల్లాపూర్‌ గ్రామానికి వెళ్లే రహదారి వనం చెరువు నాలాలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో భారీ స్థాయిలో రోడ్లపైకి నీరు చేరింది.

గాలింపు చర్యలు

ఆదివారం అర్ధరాత్రి చిన్నకోడూర్ మండలం దర్గాపల్లి‌వాగులో ఇన్నోవా కారు, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి కొట్టుకుపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ కార్వీ‌లో పనిచేసే నలుగురు వ్యక్తులు శ్రీధర్, సురేశ్, ఆనంతారం శ్రీనివాస్, జంగపల్లి శ్రీనివాస్ ఇన్నోవా వాహనంలో కరీంనగర్ రాజీవ్ రహదారి మల్లారం స్టేజ్ నుంచి సికింద్లాపూర్ మీదుగా బద్దిపడగ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. వరద నీటిలో ఇన్నోవా వాహనం కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఆనంతారం శ్రీనివాస్ గల్లంతవ్వగా, మిగతా ముగ్గురు వాగు మధ్యలో ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కాపాడారు.

మంత్రుల చొరవ

విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సిద్దిపేట కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సిద్దిపేట‌లో జరిగిన మూడు సంఘటనల‌పై ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అధికారులందరూ ఘటనా‌స్థలాల వద్దే ఉండి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్వాపూర్ వాగు‌లో ఆదివారం కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ కోసం, రాఘవపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మాటీండ్ల గ్రామంలో చెక్ డ్యామ్‌లో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు మంత్రి హరీశ్‌రావు.


Next Story

Most Viewed