- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముగ్గురు చైన్స్నాచర్లు, ఒక దొంగ అరెస్టు

దిశ, హనుమకొండ : మూడు వేర్వేరు సంఘటనల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు చైన్ స్నాచర్లతో పాటు కారులో డబ్బు బ్యాగును చోరీ చేసిన డ్రైవర్ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ మూడు సంఘటనల్లో పోలీసులు సుమారు రూ. 4 లక్షల 90 వేల విలువ గల 77.750 గ్రాముల బంగారంతో పాటు ఎనిమిది లక్షల పది వేల నగదు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. వరంగల్ కోటకు చెందిన చాపర్తి రాజేష్ ఇస్త్రీ షాపు నిర్వహిస్తూ దీని ద్వారా వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో చైన్ స్నాచింగ్ చేయాలనుకున్నాడు.
ఇందులో భాగంగా ఈనెల 11వ తారీకున హనుమకొండ రెడ్డి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై నుంచి బలవంతంగా లాక్కొని అక్కడి నుండి తప్పించుకొని వెళ్లాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు, సీసీఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసి నిందితుడిని పెద్దమ్మగడ్డ ప్రాంతంలో అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఇదే తరహాలో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు తెలిపారు.
కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో..
ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఐనవోలుకు చెందిన తాళ్లపల్లి సంపత్ కుమార్, ప్రస్తుతం హనుమకొండ, గోకుల్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మరో నిందితుడు చుక్క మురళి, నడికుడ గ్రామం, హన్మకొండకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకడైన సంపత్ కుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ కాసి డబ్బులు నష్టపోయి ఆటో రుణానికి సంబంధించి నెలసరి వాయిదాలు కట్టలేక పోయాడు. దాంతో అక్రమాలకు పాల్పడుతున్నాడు.
ఈ కేసులోని మరో నిందితుడు ఇచ్చిన సలహా మేరకు ఈ ఇద్దరు కలిసి శుక్రవారం కిరాణషాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ సదరు కిరాణషాపు యజమానురాలి మెడలోని రోల్డ్గోల్డ్ గొలుసును లాక్కొని అక్కడి నుండి ఆటోలో పారిపోయారు. ఈ ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం ఫాతిమా సెంటర్లో అరెస్టు చేసి వీరి నుండి రోల్డ్గోల్డ్ గొలుసుకున్న సుమారు 15వేల రూపాయల విలువ గల 2.750 గ్రాముల బంగారంతో పాటు ఒక ఆటో, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో..
ఈ కేసులో నిందితుడు కార్తీక్ కర్నాటక రాష్ట్రంకు చెందినవాడు. ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లో హోటళ్ల వ్యాపారం నిర్వహించే స్వాతి కిరణ్ వద్ద కారు డ్రైవర్గా పనిచేసేవాడు. నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా సంపాదించాలనుకొని కారు యాజమాని తన వ్యాపార భాగస్వామి గూడమల్ల వినయ్ కుమార్ తో కలిసి కారులో ఈ నెల 18వ తేదీన కాజీపేటకు చేరుకున్నాడు. ఇక్కడ హొటల్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి రూ. 8 లక్షల డబ్బు బ్యాగును తీసుకొని తాను ప్రయాణిస్తున్న కారులో వెనుక భాగంలో భద్రపర్చాడు.
రాత్రి భీమారంలో ఒక హోటల్ రూంలో వ్యాపారస్తులు సేదతీరుతుండగా నిందితుడు భోజనానికి వెళ్తూ కారులో భద్రపర్చిన ఎనిమిది లక్షల రూపాయల బ్యాగ్ను దొంగిలించి అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై వ్యాపారస్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ టెక్నాలజీని వినియోగించుకొని వనస్థలిపురంలో నిందితుడుని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 8 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పై మూడు సంఘటనల్లో నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డీసీపీ జనార్థన్, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు మధుసూదన్, దేవేందర్ రెడ్డి, నందిరాంనాయక్, తిరమల్ ఇన్స్స్పెక్టర్లు బాలాజీ, సతీష్, రవికుమార్, సుధాకర్ రెడ్డి ఏఏఓ సల్మాన్పాషాతో పాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, హన్మకొండ, మట్వాడా, కాజీపేట పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.