డాక్టర్లు లేరని డెలివరీ చేసిన నర్సులు...శిశువు మృతి

by Sridhar Babu |
డాక్టర్లు లేరని డెలివరీ చేసిన నర్సులు...శిశువు మృతి
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతికి గైనకాలజిస్టులు లేరని ఆస్పత్రిలోని నర్సులు డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందింది. బాధితుల వివరాల ప్రకారం జడ్చర్ల మండల పరిధిలోని నాగసాలకు చెందిన కీర్తి నెలలు నిండడంతో డెలివరీ కోసం జడ్చర్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి ఉదయం 11 గంటలకు వచ్చింది. ఆసుపత్రిలో చేరిన సమయంలో డ్యూటీ డాక్టర్లు, నర్సులు పరిశీలించి అంతా నార్మల్​గానే ఉందని, రేపటిలోగా డెలివరీ అవుతుందని చెప్పారు.

ఈ క్రమంలో కొద్దిసేపటికి కీర్తికి పురిటినొప్పులు వచ్చాయి. సాయంత్రానికి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దాంతో హెడ్ నర్స్ ఆమెకు డెలివరీ చేసింది. కానీ శిశువు మృతి చెందింది. కాగా ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్ డాక్టర్లు ఉన్నారని, తమ కూతురుకు నొప్పులు వస్తున్నాయని మధ్యాహ్నమే వారికి చెప్పినా తమ డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోయారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై డ్యూటీ డాక్టర్ ప్రశాంతి వివరణ ఇస్తూ కీర్తి కడుపులోని బిడ్డ ఉమ్మనీరు తాగడంతో పుట్టగానే మృతి చెందినట్టు చెప్పారు. ఆమెకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. ఇందులో వైద్యుల తప్పేమీ లేదని వివరించారు.

Advertisement

Next Story