కొలిక్కి వచ్చిన ముసాయిదా ప్రతిపాదనలు

by Anukaran |   ( Updated:2020-07-19 10:07:13.0  )
కొలిక్కి వచ్చిన ముసాయిదా ప్రతిపాదనలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సాగునీటిపారుదల శాఖ పునర్ వ్యస్థీకరణ కోసం కార్యదర్శి, ఇంజనీర్లు కసరత్తు చేసి ముసాయిదాను రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సోమవారం ప్రగతి‌భవన్‌లో అధికారులు, ఇంజనీర్లతో చర్చించి తుదిరూపు ఇవ్వనున్నారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా శాఖను బలోపేతం చేయాలన్న సీఎం సంకల్పంలో భాగంగా ఆ శాఖలో భారీ మార్పులే చోటుచేసుకోనున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలు.. ఇలా రకరకాల పేర్లతో సాగునీటిపారుదల శాఖలో విభాగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందికి రావాలని, ఫలితంగా పర్యవేక్షణ సమర్ధవంతంగా ఉంటుందన్నది సీఎం భావన.

నీటిపారుదల శాఖను ఇరవై ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కోదానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్‌ని ఇంఛార్జిగా నియమించాలని సీఎం గతవారం సమావేశం సందర్భంగా సూచనలు చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్‌లు .. ఇలా సమస్తం సీఈల పరిధిలోనే ఉంటాయి. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ రెండురోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌షాపు నిర్వహించారు. ముసాయిదా రూపొందించారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. దీనిపై సమీక్షలో సమగ్రంగా చర్చించిన అనంతరం తుది నిర్ణయం జరుగుతుంది.

Next Story

Most Viewed