తెరచుకోనున్న కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలు.. ఎప్పటి నుంచంటే?

by D.Reddy |
తెరచుకోనున్న కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలు.. ఎప్పటి నుంచంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను చార్‌ధామ్‌గా (Chardham) పేర్కొంటారు. హిందువులు ఈ చార్‌ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే, ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు మూసే ఉంటాయి. అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనకు తెరుస్తారు. తిరిగి కార్తీక మాసంలో అన్నా చెల్లల పండగ ముందు రోజు నుంచి మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చార్‌ధామ్ ఆలయాలు తెరుచుకునే తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. అనంతరం మే 2వ తేదీన కేదార్‌నాథ్ (Kedharnath) ఆలయం, మే 4వ తేదీన బద్రీనాథ్ (Badrinath) ఆలయం తెరచుకోనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ విష‌యాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ వెల్లడించింది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు చార్‌ధామ్ యాత్రకు విచ్చేసి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

కాగా, ఈ యమునోత్రి నుంచి ప్రారంభమై, గంగోత్రి, కేదార్‌నాథ్ గుండా వెళ్లి బద్రీనాథ్‌తో ముగుస్తుంది. ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ఆన్‌లైనులో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇక ఢిల్లీ, డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్ వంటి నగరాలకు వెళ్తే అక్కడి నుంచి వాహనాలు అందుబాటులో ఉంటాయి.



Next Story

Most Viewed