వరుసగా ఐదో రోజూ లాభపడ్డ సూచీలు!

by Harish |
వరుసగా ఐదో రోజూ లాభపడ్డ సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలను సాధించాయి. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు కొద్దిసేపటికే ఆర్‌బీఐ ప్రకటన తర్వాత లాభాల్లోకి మారాయి. సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ సమావేశంలో ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మదుపర్లలో ఉత్సాహం కనిపించింది. వరుస ఆరు సమావేశాల తర్వాత వడ్డీ రేట్ల పెంపునకు విరామం రావడం వారి సెంటిమెంట్‌ను బలపర్చింది.

దీనికితోడు కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా సూచీలు రాణించాయి. అయితే, చివరి గంట వరకు అధిక లాభాలతో పుంజుకున్న తర్వాత గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు తక్కువ లాభాలకు పరిమితమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.66 పాయింట్లు లాభపడి 59,832 వద్ద, నిఫ్టీ 42.10 పాయింట్లు పెరిగి 17,599 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆర్‌బీఐ ప్రకటన నేపథ్యంలో రియల్టీ రంగం దాదాపు 3 శాతం ఎగసింది. మిగిలిన రంగాలు ఓ మోస్తరుగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.

హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.91 వద్ద ఉంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. మార్కెట్లు తిరిగి సోమవారం తెరుచుకుంటాయి.

Advertisement

Next Story