SEBI: లిస్టింగ్‌కు ముందే షేర్లను విక్రయించే మెకానిజంపై సెబీ పరిశీలన

by S Gopi |   ( Updated:2025-01-21 17:24:10.0  )

దిశ, బిజినెస్ బ్యూరో: గ్రే మార్కెట్ యాక్టివిటీని అరికట్టేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లో షేర్లను కేటాయించిన తర్వాత, ఇన్వెస్టర్లు లిస్టింగ్‌కి ముందే విక్రయించే మెకానిజాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ చెప్పారు. మంగళవారం అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా(ఏఐబీఐ) కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. షేర్లను కేటాయించిన వెంటనే ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించే విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. గత కొన్ని నెలలుగా ఐపీఓ మార్కెట్ అత్యంత వేగంగా సాగుతోంది. అనేక కంపెనీలు పెద్ద ఎత్తున సబ్‌స్క్రిప్షన్‌లను సాధించాయి. పెట్టుబడిదారులకు లిస్టింగ్ రోజున భారీ లాభాలను కూడా ఇస్తున్నాయి. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన తర్వాత లిస్టింగ్‌కి ముందు మూడు రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో గ్రే మార్కెట్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే, వీటిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా లిస్టింగ్ రోజు లాభాలను అంచనా వేస్తునప్పుడు, ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించాలని అనుకున్నప్పుడు ఆ అవకాశం ఎందుకు ఇవ్వకూడదని మాధవి పురి బుచ్ అభిప్రాయపడ్డారు. లిస్టింగ్‌కు ముందే కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలన్నారు. లిస్టింగ్‌కి ముందే గ్రే మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగుతున్నప్పుడు, ట్రేడింగ్‌పై ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఒక ప్లాట్‌ఫామ్ సృష్టించాలని, ప్రస్తుతం దీనికి సంబంధించి స్టాక్ ఎక్స్ఛేంజీలతో చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Next Story