Tesla: ఏప్రిల్ నుంచి టెస్లా కార్ల అమ్మకాలు

by S Gopi |
Tesla: ఏప్రిల్ నుంచి టెస్లా కార్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లో అడుగుపెట్టే అంశంపై స్పష్టత వచ్చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికాలో జరిగిన భేటీ అనంతరం టెస్లా కంపెనీ దేశీయంగా 13 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. తాజాగా బుధవారం కంపెనీ మనదేశంలో షోరూమ్‌లను ఏర్పాటు చేయడం గురించి, ఏప్రిల్ నుంచి కార్ల అమ్మకాలు మొదలుపెట్టనున్నట్టు కథనాలు వెలువడ్డాయి. మొదట్లో టెస్లా కార్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తారని, వాటి ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. జర్మనీలో ఉన్న బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా ఈవీ కార్లను దిగుమతి చేయనున్నారు. దేశీయంగా రిటైల్ విక్రయాల కోసం టెస్లా రాజధాని ఢిల్లీలోని ఏరోసిటీ, ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎంపిక చేసినట్టు సమాచారం.

బిలియన్ డాలర్ల పెట్టుబడి

టెస్లాకు చెందిన కంపెనీ అధికారులు ఏప్రిల్‌లో భారత్‌ను సందర్శించనున్నారు. అలాగే, ప్రణాళిక ప్రకారం ప్రారంభ దశలో కంపెనీ 3-5 బిలియన్ డాలర్ల(రూ. 26,000-43,000 కోట్ల) వరకు పెట్టుబడి పెట్టవచ్చని తెలుస్తోంది. టెస్లా తొలినుంచి భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు అధిక సుంకాలను కారణంగా చెబుతోంది. దీనివల్ల సాధారణంగానే ఖరీదైన టెస్లా కార్లు మరింత ప్రీమియం అవుతాయనే కారణంతో భారత్‌లో తయారీ, అసెంబుల్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా లేదు. తయారీ విషయానికి వస్తే టెస్లా భవిష్యత్తులో మహారాష్ట్ర లేదా గుజరాత్‌లలో ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed