వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా బెదరం : దగ్గుబాటి పురంధేశ్వరి

by Seetharam |   ( Updated:2023-11-20 12:50:01.0  )
వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా బెదరం : దగ్గుబాటి పురంధేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదిన్నరేళ్ళలో అవినీతి రహిత పాలన చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆమె అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు.

కరవుపై బీజేపీ అధ్యయనం

రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోన్నా కనీసం సీఎం వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. మరోవైపు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోయి పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో సర్పంచ్‌లకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని, ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

బస్సు యాత్ర చేసే హక్కు వైసీపీకి లేదు

ఏపీలో వైసీపీ విధ్వంసక పాలన చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారన్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 27 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలపై దాడులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను ఇంతలా హింసిస్తున్న వైసీపీకి సామాజిక సాధికార బస్సు యాత్రలు చేసే నైతిక హక్కులు లేదని అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాని నరేంద్రమోడీకి ఓ స్పష్టమైన విధానం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed