Ap News: విశాఖ రైల్వే జోన్‌‌పై చెరో మాట.. ఎవరు చెప్పేది నిజం.. ఆలస్యానికి కారణం అదేనా.. !

by srinivas |
Ap News: విశాఖ రైల్వే జోన్‌‌పై చెరో మాట.. ఎవరు చెప్పేది నిజం.. ఆలస్యానికి కారణం అదేనా.. !
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రైల్వే జో‌న్‌ జాప్యంపై కేంద్రరాష్ట్రాల ప్రభుత్వాలు చెరో మాట చెబుతున్నాయి. రైల్వే జోన్ లేట్ అవడానికి కారణం రాష్ట్రప్రభుత్వమని అటు కేంద్రం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే జోన్ ఆలస్యం అవుతుందని పార్లమెంట్ సాక్షిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో కేంద్రప్రభుత్వం తీరుతోనే రైల్వే జోన్ ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. భూమి ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. క్లియర్ లైటిల్‌తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా రెడీగా ఉందన్నారు. రైల్వే శాఖకు లేఖ రాస్తే అటువైపు స్పందన రాలేదని కలెక్టర్ తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఎప్పుడు ముందుకు వస్తే అప్పుడు భూమిని అప్పగిస్తామని కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు.


అయితే వీరిద్దరి ప్రకటనల్లో ఏది నిజమనేదానిపై గందరగోళం నెలకొంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో రాష్ట్రం నుంచి డిమాండ్ ఉంది. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2014కు ముందు అప్పటి కేంద్రప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై హామీ ఇచ్చింది. కానీ 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విజయం సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే అప్పటి నుంచి రైల్వే జోన్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ, టీడీపీ పొత్తు ఉండటం వల్ల రైల్వే జోన్‌పై కాస్త ముందుకు సాగినట్లు అనిపించింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అప్పటి నుంచి అసలు ఆ వూసే లేదు. ఏపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వల్లే రైల్వే జోన్ ఆలస్యమని కేంద్ర రైల్వే శాఖ చెబుతూ వచ్చింది. తాజాగా జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లోనూ అదే మాట చెప్పింది. అయితే కేంద్రం తీరు వల్లే రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.


అయితే రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యానికి కారణాలు ఏమయి ఉంటాయి. రాష్ట్రం నుంచి కేంద్రానికి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. జీఎస్టీ విషయంలోనూ ఎలాంటి పంచాయితీలు లేవు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించమని విజ్ఞప్తి చేస్తున్నారే తప్ప కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయడంలేదు. పైగా కేంద్రంలో అవసరమైన ప్రతీసారి రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచింది. అలాగే రాష్ట్రానికి నిధులు విషయంలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఎప్పటికప్పుడు కేంద్రం విడుదల చేస్తూనే ఉంది. కానీ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఎందుకు వెనకాడుతున్నారనేది మాత్రం వంద టన్నుల ప్రశ్నగా మారింది. కేవలం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటన చేయడం వల్లే బీజేపీ ప్రభుత్వం వెనకాడుతుందా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఆ పేరు కాంగ్రెస్ వెళుతుందనేది బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుచేతనే రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో జాప్యం చేస్తోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే జోన్ ఏర్పాటుపై తాకే తాటిపైకి వచ్చి వెంటనే ఆవైపు పనులు ప్రారంభిస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో రైల్వే జోన్ పై ఏలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Next Story

Most Viewed