నాపై 17, పవన్‌పై 7 కేసులు పెట్టారు.. అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్

by srinivas |
నాపై 17, పవన్‌పై 7 కేసులు పెట్టారు.. అసెంబ్లీలో  చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం తీరును చంద్రబాబు ఎండగట్టారు. జగన్ సర్కార్ తనపై 17 కేసులు, పవన్ కల్యాణ్‌పై 7 కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు.2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింతను ప్రోత్సహించిందన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ కక్ష పూరిత పాలన చేసిందని ధ్వజమెత్తారు. పోలీసులను ఆయుధాల మాదిరిగా ప్రభుత్వం ఉపయోగించిందని చెప్పారు. మాట వినని పోలీసులను వీఆర్‌కు పంపి జీతభత్యాలు కూడా చెల్లించకుండా ఐదేళ్ల పాటు వేధించిందని చంద్రబాబు ఆరోపించారు.

రాజకీయ పోరాటం చేసిన వారందరిపై కేసులు నమోదు చేశారని, టీడీపీ ప్రజా ప్రతినిధులను ఎప్పటికీ బయటకు రాకుండా చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కానీ ప్రజలు అందర్నీ అసెంబ్లీకి పంపించారని తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న టీడీపీ వాల్లందరూ ఆనాటి పాలనలో బాధితులయ్యారని చెప్పారు. కుటుంబ సపరివారిపైనా అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ కుటుంబంపై అయితే 20 కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లులో నాపై రాళ్ల దాడి చేసి ఎదురు అక్రమంగా 6 కేసులు నమోదు చేశారని తెలిపారు. పుంగనూరు అల్లర్లలో 7 కేసులు నమోదు చేశారని చెప్పారు. ఈ రెండు కేసులో 286 మందిని నిందితులుగా చూపించారని వ్యాఖ్యానించారు. ఇదే కేసుల్లో మరో 409 మందిని అదనంగా నిందితులుగా చేర్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.



Next Story