ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వైసీపీ తడబడుతుందా ? నిలబడుతుందా ?

by Y.Nagarani |
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వైసీపీ తడబడుతుందా ? నిలబడుతుందా ?
X

దిశ ప్రతినిధి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో జిల్లా సారథులకు సమస్యలు సవాల్ విసురుతున్నాయా ? సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కనిపించడం లేదా? పలు నియోజకవర్గాలపై సారధులు ఫోకస్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు. కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థులు వృత్తిపరమైన సేవలో ఉండగా.. కర్నూలు అభ్యర్థి అంతర్మథనంలో పడ్డారు. దీంతో జిల్లా అధ్యక్షులు ఈ మూడు సెగ్మెంట్లలో ఇంచార్జుల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నేతలు నిమగ్నమ య్యారు. ఈ నేపథ్యంలో జిల్లా సారథులు తడబడతారా ? నిలబడతారా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీన్ రివర్స్..

కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్విప్ చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి 12 స్థానాలు గెలుపొందగా వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది. కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచారు. మంత్రాలయం, ఆలూరులో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఎమ్మెల్యేగా గెలుస్తే మైనార్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ పరిస్థితులు తలకిందులు కావడంతో అంతర్మథనంలో పడ్డారు. ఇక ఐదేళ్ల వరకు ఏం చేయాలని లెక్కలు వేసుకుంటున్నారు.

ఆయనకు కేసుల భయం...

కేసుల భయంతో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలును వీడగా వైసీపీ క్యాడర్ డైలామాలో పడింది. ఈ తరుణంలో నియోజకవర్గాలను చక్కబెట్టేందుకు గానూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నంద్యాలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కర్నూలులో మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ ఎన్నికల ముందు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఆయన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి చెందారు. ఓటమి తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడగా మరోవైపు రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలు చేసుకునేందుకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గ బాధ్యతలు ఎవరికిస్తారనే చర్చ జోరందుకుంది.

సతీశ్, సుధీర్.. దూరం దూరం

వృత్తిపరంగా వైద్యులైన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి సోదరుడు ఆదిమూలపు సతీష్, మరో వైద్యుడు నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధారా సుధీర్ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క ధారా సుధీర్ మాత్రం ముచ్చుమర్రి బాలిక ఘటన సమయంలో కనిపించారు తప్ప నేటి వరకు నియోజకవర్గంలో కనిపించిన దాఖలాల్లేవు. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా సైలెంట్ కావడంతో ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

ఇంచార్జుల ఎంపికపై కసరత్తు

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ జీవచ్ఛంలా మారింది. కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు కూడా నేతలు ముందుకు రాకుండా ఎవరికి వారుగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై.రామయ్య, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలు చాలా కష్టపడ్డారు. ఓటమి తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించడం చాలా ఖర్చుతో కూడిన పని కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఐదేళ్లు ఏం చేయాలనే యోచనలో పడ్డారు.

పార్టీ ఫిరాయింపులు..

కర్నూలులో కార్పొరేటర్లు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో కర్నూలు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను గానీ, ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి, కేడీసీసీ మాజీ చైర్ పర్సన్ విజయ మనోహరిని గానీ ఇంచార్జిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా ? లేక కొనసాగుతారా ? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

కోడుమూరు కథ వేరు..

కోడుమూరులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనకు వైసీపీలో సరైన స్థానం లేదనే చెప్పాలి. అదే నియోజకవర్గంలో మొదటి నుంచి కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడిగా, రాజకీయ వారసుడిగా, అనేక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్న నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ ను ఇంచార్జిగా నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన ఆయన అధిష్టానం సూచన మేరకు సీటును త్యాగం చేశారు. ప్రస్తుతం ఇంచార్జి లేకపోవడంతో ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తే నియోజకవర్గంపై పట్టు సాధించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నందికొట్కూరు సెగ్మెంట్ విషయంపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story

Most Viewed