ఏపీలో టీచర్ల బదిలీల రద్దు.. బొత్స సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఏపీలో టీచర్ల బదిలీల రద్దు.. బొత్స సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం 1800 మంది టీచర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో టీచర్ల బదిలీలను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పని చేశారు. కొందరు ఉపాధ్యాయులనే మాత్రమే వారు కోరుకున్న స్థానాలకు బదిలీలు చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. లక్షల రూపాయలు చేతులు మారాయని, ఇందులో సీఎంవో అధికారులు కీలక పాత్ర వహించారనే ప్రచారం సైతం జరిగింది. దీంతో టీచర్ల బదిలీలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక కొత్త ప్రభుత్వం తీసుకున్న టీచర్ల బదిలీల రద్దు నిర్ణయంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమ హయాంలో టీచర్ల బదిలీలో అక్రమాలు జరిగాయన్నది అవాస్తవమని తెలిపారు. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులను తానే కోరినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా తనపై ఆరోపణలు చేశారని, అప్పుడే ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కొంతమంది టీచర్లు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందుల దృష్ట్యా బదిలీలు కోరుకున్నారు. ఈ మేరకు అర్జీలు పెట్టుకున్నారు. వాటిని పారదర్శకంగా పరిశీలించాం. క్షేత్రస్థాయిలో రిపోర్టులు తెప్పించుకున్నాం. ఆ తర్వాతనే బదిలీలపై నిర్ణయం తీసుకున్నాం.’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.



Next Story