కాకినాడలో రీ గ్యాసిఫికేషన్ యూనిట్.. భారీ ఫ్లోటింగ్ టెర్మినల్ నిర్మాణం

by Ramesh Goud |
కాకినాడలో రీ గ్యాసిఫికేషన్ యూనిట్.. భారీ ఫ్లోటింగ్ టెర్మినల్ నిర్మాణం
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: కాకినాడలో నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో మొట్టమొదటి గ్రావిటీ బేస్డ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుని, రీగ్యాసిఫికేషన్ చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు క్రౌన్ ఎల్ఎన్జీ సీఈవో స్వపన్ కఠారియా తెలిపారు.

గతేడాది దేశ పర్యటనకు వచ్చిన ఆయన, తాజా గా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2028నాటికి కాకినాడ వద్ద సముద్రంలో తేలియాడే ఎల్ఎన్జీ యూనిట్‌ను వాణిజ్యపరంగా అందుబా టులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. తీవ్ర తుపానులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా దేశంలోనే రెండో అతిపెద్ద యూనిట్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో ఆరు టెర్మినల్స్ ఉండగా, ఇవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్నారు. కాగా, క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్ర పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది.

ఎల్ఎన్జీకి పెరుగుతున్న డిమాండ్

దేశీయ ఇంధన అవసరా ల్లో సహజవాయు వినియోగాన్ని భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎల్ఎన్జీకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో వినియోగం 6 శాతంగా ఉందని, 2030 నాటికి 15 శాతానికి పెంచాలని ప్రధాని లక్ష్యం గా పెటుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 20.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ వినియోగం జరగ్గా, పదేళ్లలో ఇది 72.9 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు.

Next Story

Most Viewed