Shocking: ఐటీ ఎగుమతుల్లో ఏపీ పరిస్థితి దయనీయం

by srinivas |
Shocking: ఐటీ ఎగుమతుల్లో ఏపీ పరిస్థితి దయనీయం
X
  • దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 11.59 లక్షల కోట్లు ఎగుమతి
  • కానీ ఏపీ నుంచి మాత్రం రూ.1256 కోట్లుమాత్రమే
  • ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్ ఖాతా రూ.1290 కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా..సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని తెలిపారు.

ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1శాతం అని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహదపడిందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. కేంద్రం సమాధానంపై ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పని తీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. ఐటీ రంగం ఎగుమతులలో ఏపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం ఢమాల్ అయిందన్నారు.

అత్యంత విజయవంతమైన, సమర్థవంతమైన ఐటీ మానవ వనరులను అందించడంలో దేశానికి, ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగం నుంచి పూర్తిగా లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చురుగ్గా కోరుతూనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉన్న ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మానుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు.

Next Story

Most Viewed