US: ముంబై పేలుళ్ల నిందితుడిని భారత్‌కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు

2008 ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన తహవూర్‌ రాణాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-08-17 06:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2008 ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన తహవూర్‌ రాణాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడిని భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 26/11 ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 166 మంది చనిపోయారు. ఘటనలో తహవూర్‌ రాణా కీలక నిందితుడిగా ఉన్నారు. దాడులకు ఆర్థిక సాయం చేశాడు, ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్‌ హెడ్లీకి రాణా చాలా సన్నిహితుడు. ప్రస్తుతం రాణా కెనడాలో వ్యాపారవేత్తగా ఉన్నాడు. ఈ దాడులకు సాయం చేశాడన్న ఆరోపణలతో గతంలో షికాగో కోర్టు జైలు శిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో అమెరికా-భారత్‌ నేరస్థుల అప్పగింతలో భాగంగా అతడిని ఇండియాకు అప్పగించాలని అధికారులు కోరారు. గత ఏడాది కాలిఫోర్నియా కోర్టు తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించాలని తీర్పునిచ్చింది. దీంతో అతడు దీనిని సవాల్ చేస్తూ ఇదే కోర్టులో ది రైటాఫ్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశాడు. తాజాగా విచారణలో భాగంగా రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇంకా రాణాకు ఉంది.

Tags:    

Similar News