Indian fishermen: 11 మంది భారతీయ మత్స్యకారుల అరెస్ట్.. శ్రీలంక నేవీ వెల్లడి

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 11 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది.

Update: 2024-08-24 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 11 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. వీరంతా మెకనైజ్డ్ బోట్‌లో సముద్రంలోకి వెళ్లి కొడియాకరై (పాయింట్ కాలిమెర్)కి ఆగ్నేయంగా 12 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టారు. ఆ సమయంలో శ్రీలంక నేవీకి చెందిన నార్తర్న్ నేవల్ కమాండ్ బృందం సరిహద్దులు దాటినందుకు వారిని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులను అదుపులోకి తీసుకుని, వారి బోటును స్వాధీనం చేసుకుని కంగేసంతురై ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. అనంతరం అరెస్టు చేసిన మత్స్యకారులను మైలిడ్డిలోని శ్రీలంక మత్స్య, జలవనరుల శాఖ అధికారులకు అప్పగించారు.

కాగా, శ్రీలంక నావికాదళం ప్రకారం, 2024లో శ్రీలంక జలాల్లో మొత్తం 45 భారతీయ ట్రాలర్లు, 333 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చెన్నైలోని మత్స్య, మత్స్యకారుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ అరెస్టును పట్టాలి మక్కల్ కట్చి అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, సీపీఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ఆర్ ముత్తరసన్‌లు భారతీయ మత్స్యకారుల అరెస్టును ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఇదే అంశంపై సీఎం స్టాలిన్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News