Independence Day : UK లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Update: 2024-08-15 20:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దొరైస్వామి మాట్లాడుతూ.. " అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత దౌత్యవేత్తగా జాతీయ జెండాను ఎగురవేయడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదని దొరైస్వామి అన్నారు. మనమందరం సమిష్టి కృషితో పని చేసి 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాలని దొరైస్వామి చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో భరతనాట్యం , వందేమాతరం అలాగే సారే జహాన్ సే అచ్చా వంటి అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.బ్రిటన్ లోని అన్ని రంగాలకు చెందిన భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. ఈ ఈవెంట్ తమకు గర్వకారణంగా ఉందని, భారతదేశంలోని తమ మూలాలతో కనెక్ట్ అయ్యేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో సహాయపడుతాయని వారు చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక భారతీయ విద్యార్థి ప్రసంగిస్తూ.. " విద్యార్థిగా ఉన్నందున, నేను లండన్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని, ఇది చాలా మంచి అనుభవమని, ఈ ఈవెంట్ లో హైకమిషనర్, డిప్యూటీ హైకమిషనర్ లాంటి అనేక మంది భారత అధికారులను కలవడం గొప్పగా ఉందని విద్యార్ధి చెప్పారు.అలాగే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఒక భారతీయ మహిళ మాట్లాడుతూ.. " తాను 2023 సెప్టెంబర్ లో లండన్‌కి వచ్చానని, మనల్ని వలసరాజ్యం చేసిన దేశంలో మన స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం చాలా గర్వకారణమని ఆమె చెప్పింది.


Similar News