వాషింగ్టన్: ఇజ్రాయెల్ అంశంపై రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి నేతలు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి స్పందించారు. ‘‘ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడిన హమాస్, హిజ్బుల్లా ఉగ్ర సంస్థలకు ఇరాన్ సపోర్ట్ ఉంది. అవి అమెరికాను ఇష్టపడవు. అందుకే అది ఇజ్రాయెల్పై జరిగిన దాడి కాదు. దాన్ని అమెరికాపై హమాస్ చేసిన దాడిగానే భావించాలి’’ అని పేర్కొంటూ నిక్కీ హేలీ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఉగ్రమూకలు చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. నెతన్యాహూ వాళ్ల కథను ముగించండి’’ అని పిలుపునిచ్చారు.
‘‘ఇజ్రాయెల్ పూర్తిగా అంతర్గత రాజకీయాల్లో తలమునకలై ఉన్నప్పుడు హమాస్ ఈ దాడి చేసింది. ఇజ్రాయెల్పై జరిగిన దాడిని అమెరికా మేలుకొలుపుగా భావించాలి. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగింది, రేపు అమెరికాలో జరగొచ్చు’’ అని పేర్కొంటూ వివేక్ రామస్వామి ట్వీట్ చేశారు. ‘‘సరిహద్దు రక్షణ వ్యవస్థ, సైబర్ భద్రత, అణు క్షిపణి రక్షణ, అంతరిక్ష ఆధారిత రక్షణ వ్యవస్థలపై అమెరికా సర్కారు దృష్టి సారించకుండా.. ఇతర దేశాల ప్రయోజనాలపై ఫోకస్ పెట్టింది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.