రష్యా యుద్ధా నేరాలపై ఐసీసీకి అమెరికా సాక్ష్యాలు.. ప్రెసిడెంట్ బైడెన్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న యుద్ధా నేరాలపై సాక్ష్యాధారాలను 'ది హేగ్'లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కు ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ కార్యాలయం "పెంటగాన్" వ్యతిరేకించిందంటూ "న్యూయార్క్ టైమ్స్" సంచలన కథనం పబ్లిష్ చేసింది. ఆ సాక్ష్యాలను అందిస్తే.. అమెరికా బలగాలను కూడా ఐసీసీ విచారించే అవకాశముందని బైడెన్ను పెంటగాన్ హెచ్చరించింది. ఈ సూచనలను పట్టించుకోకుండా సాక్ష్యాలను అంతర్జాతీయ న్యాయస్థానానికి అందించాలని బైడెన్ నిర్ణయించారని కథనం వెల్లడించింది.
వచ్చే మంగళవారం నాటికి రష్యా యుద్ధ నేరాల సాక్ష్యాలను ఐసీసీకి అమెరికా అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై అమెరికా వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఉక్రెయిన్లో రష్యా ఆగడాలను పెంటగాన్ పట్టించుకోవట్లేదని రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అమెరికా సెనెట్లో గతవారం సుదీర్ఘ చర్చ జరిగింది. రష్యా యుద్ధ నేరాలపై సేకరించిన సాక్ష్యాలను అంతర్జాతీయ కోర్టుకు ఇవ్వాలని సెనెటర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.