గులాబీ తోటలో కమలం పువ్వులు.. లీకు వీరుల్లో ఇద్దరు మంత్రులు!

గులాబీ తోటలో కమలం పూలు దాగి ఉన్నాయి. కారు కదలికలను ఇట్టే గమనిస్తున్నాయి. క్షణాల్లో కాషాయ గూటికి చేరవేస్తున్నాయి.

Update: 2022-03-17 05:10 GMT

గులాబీ తోటలో కమలం పూలు దాగి ఉన్నాయి. కారు కదలికలను ఇట్టే గమనిస్తున్నాయి. క్షణాల్లో కాషాయ గూటికి చేరవేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పటిష్టమైన ఇన్ ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. అది ఎక్కడో కాదు! టీఆర్ఎస్ పార్టీలోనే జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఈ నెట్ వర్క్ చురుకుగా పనిచేస్తున్నది. ఇలా పనిచేస్తున్న వారిలో ఇద్దరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీలో టికెట్టు రాదని భావిస్తున్న వీళ్లు బీజేపీ అధినాయకత్వానికి బెండ్ అయ్యారు. ఓ వైపు కేంద్రంపై ఫైర్ అవుతూనే.. తెరచాటు నుంచి సమాచారం అందిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై కమలనాథుల వ్యూహం ఊపందుకున్నది. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను లాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ వచ్చే నెల అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరిని పార్టీలో చేర్చుకోనున్నది. టీఆర్ఎస్‌ పట్ల మాత్రం భిన్నమైన తీరులో స్కెచ్ వేసంది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అంతర్గత సమాచారాన్ని కేసీఆర్ సేకరిస్తున్నట్లుగానే టీఆర్ఎస్‌లోని తాజా అప్‌డేట్స్ కోసం బలమైన ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకున్నది. ముల్లును ముల్లుతోనే తీసే ఎత్తుగడను రూపొందించుకున్నది. ఈ ఏడాది చివరికల్లా ఫస్ట్ ఫేజ్ స్ట్రాటజీని పూర్తిచేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే అర డజను మందితో సంప్రదింపులను పూర్తిచేసింది. పార్టీ మారడానికి గ్రౌండ్ రెడీ అయింది. రెండు వైపులా ముహూర్తం కుదిరితే కండువా మార్చుకోవడమే తరువాయి. ప్రతి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నవారెవరనేది గుర్తించింది. ఇందుకోసం జిల్లాకో టీమ్‌ను ఏర్పాటుచేసుకున్నది. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలో చేర్చుకోడానికి ఇతర రాష్ట్రాల్లో చర్చల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది.

రాష్ట్రంలోని ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది జిల్లాల్లో ఈ ప్రక్రియ ఒకింత వేగంగా సాగుతున్నది. కాంగ్రెస్ కు పట్టు ఉన్న ఖమ్మం జిల్లాలోనూ స్పెషల్ టీమ్ పనిచేస్తున్నది. తొందర్లోనే కొద్ది మంది పేర్లు వెలుగులోకి వస్తాయి. వీలైతే హైదరాబాద్ లేదంటే ఢిల్లీలో చేరికలు ఉంటాయి. టీఆర్ఎస్ విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడే ఎవరినీ టచ్ చేయవద్దనే ఎత్తుగడను అవలంబిస్తున్నది. ప్రస్తుతం పార్టీతో అంటీముట్టనట్లుగా ఉండే సీనియర్ లీడర్లు వారంతట వారు నిర్ణయం తీసుకుంటే చేర్చుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నది. అక్కడ యాక్టివ్‌గా ఉన్నవారి జోలికి మాత్రం వెళ్లొద్దనే జాగ్రత్తలు తీసుకుంటున్నది. టీఆర్ఎస్‌లో ఉంటూనే ఆ పార్టీ కదలికలను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించేలా ఇన్‌ఫార్మర్ తరహాలోనే ఆ నాయకులను వాడుకోవాలనుకుంటున్నది. అన్ని జిల్లాల్లోనూ కనీసంగా ఒకరి చొప్పున ఇలాంటి వ్యక్తుల్ని తనవైపు తిప్పుకున్నది. ఎన్నికల సమయంలో అధికార పార్టీలో టికెట్ రాకపోతే వెంటనే బీజేపీ తరఫున పోటీచేయించడమే ఈ వ్యూహం. ఆ మేరకు హామీ ఇచ్చింది. టికెట్ వస్తుందో రాదోననే అనుమానం ఉన్నవారితో కమలం పార్టీ తన పని కానిస్తున్నది. అప్పటివరకూ ఎలాంటి అనుమానం రాకుండా టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టినా బీజేపీ నాయకత్వం పట్టించుకోదు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా వారి జోలికి వెళ్లదు. పైగా టీఆర్ఎస్‌లో నమ్మకమైన లీడర్‌గా గుర్తింపు ఉండాలనే సూచిస్తున్నది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలంటూ ప్రోత్సహిస్తున్నది.

కనీస స్థాయిలోనూ అనుమానం రావద్దంటే ఈ స్ట్రాటజీ బెటర్ అని భావిస్తున్నది. మావోయిస్టు పార్టీలో ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ ను పోలీసులు ఏర్పాటుచేసుకునే తరహాలోనే టీఆర్ఎస్‌‌లో బీజేపీ అమలుచేస్తున్నది. మంత్రివర్గం నుంచి తొలగించడానికి రెండు రోజుల ముందు వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, మోడీ వైఖరిని ఈటల రాజేందర్ ఇదే తరహాలో తూర్పారబట్టారు. ఇలాంటి ఇన్‌ఫార్మర్లలో ఇద్దరు మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు బీజేపీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఏం చేయబోతున్నది? గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉంటుంది? ఢిల్లీ టూర్‌ల ప్రాధాన్యం ఏంటి, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్లాన్ జరుగుతున్నది.. ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయడమే ఈ ఇన్‌ఫార్మర్ల పని. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ పనిచేస్తుంది.

Tags:    

Similar News