12 సీట్లు కావాలని ఆ సామాజికవర్గ నేతలు డిమాండ్.. రేవంత్ రియాక్షన్ ఇదే!

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల పీఠముడి తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా వీడటం లేదు. అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు చేరింది.

Update: 2023-10-06 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల పీఠముడి తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా వీడటం లేదు. అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు చేరింది. అయినా ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాకపోగా రోజుకో కొత్త డిమాండ్ హస్తం పార్టీలో ఆసక్తిగా మారుతోంది. ఓ వైపు తమకు తగినన్ని టికెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ నేతలు పట్టుబడుతున్న వేళ.. కమ్మ నేతలూ తమకు 10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. శుక్రవారం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. అయితే కాంగ్రెస్‌కు తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక మద్దతు పలకడం విషయాన్ని మరింత రక్తికట్టిస్తోంది.

30 స్థానాల్లో మేమే డిసిషన్ మేకర్స్:

రాష్ట్రవ్యాప్తంగా 30 స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా తమకు ఉందని మరో 10 నియోజకవర్గాల్లోనూ తమ సామాజిక వర్గం బలంగా ఉందని కమ్మ నేతలు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కమ్మవారికి గతంలోనూ సరైన ప్రాధాన్యత దక్కలేదని అందువల్ల ఈసారి తప్పకుండా తగినన్ని సీట్లు కేటాయించి న్యాయం చేయాలని లెక్కలతో అధిష్టానానికి వివరించారు. శేరిలింగపల్లి, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, ఖమ్మం, మల్కాజ్ గిరి, కొత్తగూడెం, జూబ్లిహిల్స్, కోదాడ, పాలేరు, ఉప్పల్, రాజేంద్ర నగర్, కూకట్ పల్లి, పటాన్ చెరు, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పినపాక, సత్తుపల్లి, మధిర, అశ్వరావుపేట, ఇల్లందు, వైరా, భద్రాచలం, ములుగు రిజర్వుడ్ స్థానాల్లోనూ తాము బలంగా ఉన్నామని, ఇక జనరల్ స్థానాలైన నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఖైరతాబాద్, సనత్ నగర్, మేడ్చల్ లో గెలుపు ఓటములు ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నామని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు మరో 10 స్థానాల్లో తాము బలంగా ఉన్నట్లు వివరించారు.

ఇవ్వదగిన చోట్ల టికెట్లు ఇస్తాం: రేవంత్ రెడ్డి

కమ్మ నేతల డిమాండ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని వివిధ సామాజిక వర్గాల నేతలు కోరుతున్న మాట వాస్తవమేనని కమ్మ నేతల రిప్రజెంటేషన్ విషయం తమ పార్టీ పెద్దలు తనకు చెప్పినట్లు తెలిపారు. ఇటీవల ఓబీసీ నేతలు కూడా తమకు టికెట్లు ఇవ్వాలని కోరారని అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని టికెట్లు ఇవ్వగలిగిన చోట్ల టికెట్లు ఇస్తాం, కుదరని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన నామినేటెడ్ పోస్టులు ఇచ్చి అన్ని సమాజిక వర్గాలకు తగిన న్యాయం చేస్తామన్నారు.

Tags:    

Similar News