బీజేపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసే పని అదే: అమిత్ షా

ఈసారి తెలంగాణలో మూడు దీపావళి జరగబోతున్నాయని మొదటి దీపావళి ఇటీవలే జరుపుకున్నారని, డిసెంబర్ 3వ తేదీన బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి

Update: 2023-11-20 11:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈసారి తెలంగాణలో మూడు దీపావళి జరగబోతున్నాయని మొదటి దీపావళి ఇటీవలే జరుపుకున్నారని, డిసెంబర్ 3వ తేదీన బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి దీపావళి, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి జరుపుకోబోతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం జనగామ, కోరుట్లలో నియోజకవర్గాల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ మూడు కుటుంబ పార్టీలేనని జనరేషన్లు మారినా ఇవి కుటుంబ పార్టీలుగానే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ 2 జీ, ఎంఐఎం 3జీ, కాంగ్రెస్ 4జీ పార్టీలు అయితే బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి అక్రమాలే అని ధ్వజమెత్తారు. అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులందరినీ జైలు ఊచల వెనక్కి నెట్టించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ, పాస్ పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ మిషన్‌లలో అవినీతి జరిగిందని వాటిని తాము బయటకు తీయబోతున్నామన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ధ్వజమెత్తారు.

మూడు షుగర్ ఫ్యాక్టరీలు రీ ఓపెన్:

బీజేపీ అధికారంలోకి వస్తే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంతో పాటు నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్థూపం నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బీసీలను మోసం చేశాయని తెలంగాణలో తొలిసారి బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ చేయబోతున్నదన్నారు. ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసగించారని ధ్వజెత్తారు. మాదిగల కోసం వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. పసుపు బోర్డును ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ రైతుల ఆకాంక్షను మోడీ నెరవేర్చారన్నారు. వరి ధాన్యాన్ని రూ.3100 మద్దతు ధరతో పూర్తిగా కొనుగోలు చేస్తామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ, వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ యాత్రల సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని అలాగే 2024లో మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News