Akbaruddin : హైద‌రాబాద్‌లో లా అండ్ ఆర్డ‌ర్ ఎక్క‌డ‌..? అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఫైర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా విఫ‌లం అయ్యాయ‌ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు.

Update: 2024-07-29 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైద‌రాబాద్ న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా విఫ‌లం అయ్యాయ‌ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయ‌ని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ చర్చల్లో భాగంగా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే రిప్లై ఇచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

లా అండ్ ఆర్డర్ నగరంలో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం అని, కానీ వాళ్లు రాత్రి అయితే లాఠీఛార్జ్ చేస్తున్నారని అన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నది క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి అని, కానీ సామాన్యులపై లాఠీ ఛార్జ్ చేయడానికి కాదన్నారు. పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారని, దీంతో హత్యలు పగటిపూట జరుగుతున్నాయ‌ని అక్బరుద్దీన్ విమర్శించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రాత్రి స‌మ‌యాల్లో ఆస్ప‌త్రుల‌కు వెళ్తున్న వారిపై, ఐటీ ఉద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని అన్నారు.

హైదరాబాద్‌లో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ‘మామూళ్లు’ వెళ్తున్నాయని ఆరోపించారు. ఒక ఏసీపీ తనకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు మామూళ్లు వస్తున్నాయి కదా దానితో నిర్మించండి అని చెప్పినట్లు పేర్కొన్నారు. సామాన్యులపై లాఠిచార్జ్ చేయడం కాకుండా క్రిమినల్స్‌, గంజాయి తరలించేవారని కొట్టాలని సూచించారు.

Tags:    

Similar News