Rains: ఆరెంజ్ జోన్‌లోనే సగం జిల్లాలు.. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక సూచన..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల

Update: 2024-07-20 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సగం జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొని వాటిని ఆరెంజ్, ఎల్లో వార్నింగ్ జాబితాలో చేర్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందువల్లనే ఆరెంజ్ జాబితాలో పెట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నందున ఎల్లో జాబితాలో పెట్టినట్లు తెలిపింది.

వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల వాగులకు గండిపడడం, నివాస ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. వరదలను దృష్టిలో పెట్టుకుని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్‌ను విడిచిపెట్టి వెళ్లొద్దని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నతాధికారులిచ్చే ఆదేశాల ప్రకారం కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని వరద పరిస్థితిని, లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుంటూ సిబ్బందిని సన్నద్ధం చేశారు. చెరువులకు గండ్లు పడిన విషయాన్ని తెలుసుకుని పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేలా నివారణ, నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వివరాలను జిల్లా అధికారుల ద్వారా తెప్పించుకున్న చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి రెండు రోజుల నుంచి కలెక్టర్లను, వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షం ఉన్నప్పుడు ప్రజలు బైటకు రావద్దని జిల్లా అధికారులు ప్రజలకు సూచించారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉన్నది. రెండు బేసిన్‌లలోని వరద ఉధృతిని ప్రతీ గంటకు తెలుసుకుంటున్న ఇరిగేషన్ అధికారులు స్థానిక ఇంజినీర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 81 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నది. గతేడాది జూలై 20న శ్రీశైలంలో 808 అడుగుల నీటి మట్టం ఉంటే ఇప్పుడు అది 810 అడుగులకు చేరుకున్నది. నాగార్జునసాగర్‌లోకి మాత్రం వరద నీరు ఇంకా ఊపందుకోలేదు. గతేడాదికంటే తక్కువ నిల్వ మాత్రమే ఉన్నది. కృష్ణా బేసిన్‌లో ఎగువ అలమట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో సగటున 65 వేల క్యూసెక్కులకుపైగానే నమోదవుతూ ఉన్నది. గోదావరిలో బేసిన్‌లో సైతం వరద తీవ్రత ఎక్కువగానే ఉన్నది.


Similar News