బడిలో పంతుళ్లు డుమ్మా..విద్యార్థులు హాజరు.. అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం

విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన

Update: 2024-09-19 15:50 GMT

దిశ, కొత్తగూడ: విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరు అవుతున్న సంఘటనలు ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో పరిపాటిగా మారింది. తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇందుకు బలం చేకూరుస్తుంది. గంగారం మండలం జంగాలపల్లి పరిధి కోయ గుంపు పాఠశాలల్లో దాదాపు 25 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో విధులు నిర్వహించవలసిన ఉపాధ్యాయురాలు గురువారం విధులకు హాజరు కాలేదు. ఈ క్రమంలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు చేసేదేం లేక అక్కడే ఆడుతూ పాడుతూ గడిపారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం, పక్కనే మొక్కజొన్న, పొలాలు ఉండటంతో విషపు పురుగులు కుట్టే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో టీచర్ విధులకు గైర్హాజరు అయితే సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎం వేరే టీచర్ ని అక్కడికి పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓసీఆర్పీ ని వెళ్లాలని సూచించినప్పటికీ అలా వెళ్లి ఇలా రావడంతో పిల్లలు యథేచ్ఛగా పాఠశాల పరిసరాల్లో ఆడుతూ కనపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.

మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటాం: పెనుక వీరస్వామి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

కోయ గుంపు పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయురాలు వ్యక్తిగత పనుల వలన ఈ రోజు సెలవు పెట్టింది. ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులను పంపిద్దామంటే సరిపోయేలా ఉపాధ్యాయులు లేరు. ఓసీఆర్పీ ని కోయగూడెం వెళ్లమని చెప్పాను. కొంత సమయం మాత్రమే ఉండి వెళ్లిపోయాడని తెలిసింది. మరోమారు ఇలా జరగకుండా చూస్తాను.

బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు : దండు ప్రవీణ్ యువకుడు

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరులకు విద్య అందని ద్రాక్ష అవుతుంది. ప్రభుత్వం కోట్లు వెచ్చించి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యం, ఉపాధ్యాయుల డుమ్మా కొడుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఉన్నత అధికారులు విశ్లేషణ చేసి ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా చూసి నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయుల పై చర్య తీసుకోవాలి.


Similar News