బయ్యారంలో టెన్షన్ ..టెన్షన్.. పోలీసు పహరాలో బస్టాండ్ రోడ్డు..

మండలకేంద్రంలోని బయ్యారం రెవెన్యూ 687 సర్వే నెంబర్

Update: 2024-09-25 11:40 GMT

దిశ,వెబ్ డెస్క్: మండలకేంద్రంలోని బయ్యారం రెవెన్యూ 687 సర్వే నెంబర్ సీఎంసీ స్థలం ( చౌదరీ మైనింగ్ కంపెనీ) 1999,2001 సం,లలో గోగినేని శేషగిరిరావు గ్రామ అభివృద్ధికి తెల్ల కాగితంపై రాసి ఇచ్చినట్లు సమాచారం. భూములకు రెక్కలు వచ్చి రేట్లు పెరగడంతో పలువురు ఈ భూమిపై కోర్టు వరకు వెళ్లారు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండటం‌ ,భూమి గతంలో 1992 సం..నుండి నేటి వరకు గ్రామ కంఠం సర్కార్ , రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావడం జరిగింది. దీనిపై మండలం లో అఖిలపక్ష పార్టీ నాయకులు గ్రామానికి ఇచ్చిన భూమి లో నిర్మాణాలు చేస్తున్నారని తహశీల్దార్ బండారి విజయ కు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం చేయకూడదని నిర్మాణ ప్రాంతంలో గోడ నోటీసులు అంటించారు.నోటీసులు పరిగణలో తీసుకోకుండా నిర్మాణాలు ఎలా చేస్తారని అఖిలపక్షం పార్టీ పిలుపు మేరకు బుధవారం రాస్తారోకో చేయాలనుకున్నారు.

ఈ విషయం పోలీసులకు ముందుగా తెలియడంతో జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు ,ఇతర జిల్లా పోలీసు సిబ్బందితో అఖిలపక్ష నాయకులు సీపీఐఎమ్ఎల్ పార్టీ నాయకులు పద్మ, సీపీఎం జిల్లా నాయకుడు మండారాజన్న , సీపీఐ మండల కార్యదర్శి సారక శ్రీను , అధికార పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య ,సోసైటి అధ్యక్షుడు మూల మధుకర్ రెడ్డి ,సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీను, తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అదేవిధంగా సీఎంసీ భూమి తమదేనంటున్న అంగోత్ ఏసు ,భూక్యా హరిరాం ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏఎస్పి చెన్నయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ రవికుమార్ , గూడూరు సీఐ కోట బాబురావు , డోర్నకల్ సీఐ రాజయ్య ,జిల్లాలో పలు స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గార్ల , బయ్యారం ,డోర్నకల్ ఎస్ఐ లు , జీనత్ కుమార్, తిరుపతి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్ లపై కాంగ్రెస్ నాయకుల ధర్నా..బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో..

మండలం లో కొత్తపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయ్యారం సీఎంసీ స్థలంపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో ను ఎస్ఐ అడ్డుకొని రాస్తారోకో విరమింప చేశారు.బయ్యారం లో ఇల్లందు - మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నాయకుల అక్రమ అరెస్టు లపై కాంగ్రెస్ , బీజేపీ ,న్యూడెమోక్రసీ ,బీసీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు ముల్కూరి వీరారెడ్డి మాట్లాడుతూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న భూక్యా శ్రీరాం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రశాంతంగా ఉన్న బయ్యారంలో అలజడి లేపుతున్నారని ఆరోపించారు. 15 ఏళ్ల క్రితం సీఎంసీ స్థలం 1800 గజాలు గ్రామానికి దానం చేస్తే దీనిపై కన్నేసిన ఓ ముగ్గురు వ్యక్తులు గిరిజన, రెవెన్యూ చట్టాలు అడ్డు పెట్టుకొని కాజేయాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.5.60 కోట్ల ఉండగా గిరిజన చట్టాలతో ఆ భూమి రూ. 60 లక్షలకు కొనుగోలు చేనట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రెవెన్యూ అధికారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్ ,సత్యం , చంద్రయ్య ,మురళీకృష్ణ ,రాజేష్, పిచ్చయ్య , దాసరి రాము ,యాకయ్య ,వీరయ్య ,రాజేష్ ,శ్రీను ,ఎం ఆర్ పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనిపై డీఎస్పీ తిరుపతి రావు వివరణ కోరగా సీఎంసీ భూ వివాదంతో గత కొంత కాలంగా అనేక మంది కోర్టుల వరకు వెళ్లారని , మండలం లో ఎలాంటి వైలెన్స్ కి తావు ఇవ్వకుండా ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూస్తున్నమని తెలిపారు.


Similar News