KU: కేయూ భూకబ్జా కేసులపై హై టెన్షన్.. హైకోర్టును ఆశ్రయించిన 9 మంది
కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో: కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే ఆఫీసు అధికారులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా వరంగల్ మున్సిపల్ ఆఫీసు అధికారులు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్, మిగితా వారి ఇంటి నెంబర్లను చూయిస్తూ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 254 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది.
నేడు హైకోర్టులో వాదనలు..
సెక్షన్ 254 కింద డిప్యూటీ కమిషనర్, కాజీపేట సర్కిల్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 2న కేయూ పరిధిలోని భూముల ఆక్రమణకు సంబంధించి బీసీ కాలనీ గుండ్లసింగారం కుమారపల్లిలో ఉంటున్న కొంతమందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 9 మంది హైకోర్టును ఆశ్రయించారు. గురువారం హైకోర్టులో వీరి అభ్యర్థనపై వారి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించనున్నారు. జీడబ్ల్యూఎంసీ ఇచ్చిన నోటీసులకు ఇదే నెల 5న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్లు కోరుతున్నారు. సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి చర్యలు జీడబ్ల్యూఎంసీ తీసుకోవద్దని ఉత్తర్వులు వెలువరించాలని హైకోర్టును 9 మంది పిటిషనర్లు కోరుతున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.