అక్రమంగా విద్యుత్ వాడకం.. అధికారులు, విలేకర్లపై 'రాధా స్టీల్' సిబ్బంది దౌర్జన్యం

Update: 2024-09-27 12:36 GMT

దిశ, మంగపేట : మూతపడ్డ బిల్ట్ కర్మాగారంలోని యంత్రాలు, పరికరాలు, స్టీల్, ఐరన్ మెటీరియల్ తరలించేందుకు ఫిన్క్వెస్టు కంపెనీ నుండి కాంట్రాక్టు పొందిన 'రాధా స్టీల్' అనే సంస్థ అక్రమంగా విద్యుత్ ని వాడుకుంటుంది. బిల్ట్ ప్రహారీని ఆనుకుని వీధివ్యాపారాలు చేస్తున్న షాపుల నుండి అక్రమంగా విద్యుత్ సరఫరా తీసుకుని 6 నెలలుగా కార్యాలయాలకు విద్యుత్ ను వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

విషయం తెలుసుకున్న కరెంట్ ఏఈ గుర్రం ప్రశాంత్ రెడ్డి, తన సిబ్బందితో బిల్ట్ కర్మాగారంకు వెళ్ళగా.. రాధా స్టీల్ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది వారిని రెండు గంటలకుపైగా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడి తతంగాన్ని కవరేజ్ చేస్తున్న విలేకర్ల పట్ల కూడా సిబ్బంది దురుసుగా ప్రవర్తించి దాడి చేసినంత పని చేయడమే కాకుండా.. విలేకర్లకు డబ్బులిస్తే ఏమైనా చేసుకోవచ్చా? అంటూ విమర్శలు చేశారు.



రెండు గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం, విద్యుత్ అధికారులను లోనికి అనుమతించింది రాధా స్టీల్ సిబ్బంది. అయితే.. అధికారులు జరిగిన తనిఖీలను విలేకరులు కవర్ చేయకుండా, అడుగడుగునా అడ్డుకున్నారు. మూతపడ్డ బిల్ట్ కర్మాగారంలోని యంత్రాలు, పరికరాలు,స్టీల్, ఐరన్ తరలించేందుకు 6 నెలల క్రితం బిల్ట్ కు వచ్చిన రాధా స్టీల్ యాజమాన్యం, కర్మాగారంలోని పెద్ద భవనాలు, చిమ్నీలు, బాయిలర్ తో పాటు అందులోని వందలాది భవనాలను కూల్చుతూ అక్కడి యంత్రాలు ఐరన్ స్టీల్ తరలిస్తున్నది.

ఇందుకు గాను యాజమాన్యం పెద్ద పెద్ద జనరేటర్లను ఉపయోగిస్తూనే.. సిబ్బంది ఉపయోగించే అడ్మినిష్ట్రేషన్ భవనాలకు విద్యుత్ లు వాడుకుంటోంది. మూతపడి ఉన్న వీధి వ్యాపారులకు చెందిన షాపులను ఎంచుకుని వారి కమర్షియల్, సెకండ్ కేటగిరీ విద్యుత్ మీట్లర్ల రీడింగ్ తిరగకుండా పాడు చేసి, వాటి నుండి వైర్లు వేసుకుని 6 నెలలుగా యదేశ్చగా విద్యుత్ ను రాంగ్ కేటగిరేషన్ పద్దతిలో వాడుతున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం గుర్తించిన ఏఈ గుర్రం ప్రశాంత్ రెడ్డి తన సిబ్బందితో బిల్ట్ లోకి వెళ్లి వైర్లను తొలగించి రాధా స్టీల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. దీంతో కొంత ఇబ్బంది పడ్డ 'రాధా స్టీల్' యాజమాన్యం విద్యుత్ అధికారులను మచ్చిక చేసుకుని 4 నెలలుగా వారికి నెల నెల ముడుపులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. బయటకు పొక్కడంతో శుక్రవారం తన సిబ్బందితో రెండోసారి ఏఈ గుర్రం ప్రశాంత్ రెడ్డి తనిఖీలు చేశారు. రాధా స్టీల్ అక్రమ విద్యుత్ వాడకం బయటపడడంతో యాజమాన్యం సిబ్బంది కల్లు తాగిన కోతి చందంలా చిందులేసింది.

'రాధా స్టీల్' రాంగ్ కేటగిరేషన్ విద్యుత్ వాడకం నిజమే :  గుర్రం ప్రశాంత్ రెడ్డి,ఏఈ

మూతపడ్డ బిల్ట్ కర్మాగారంలోని తన కార్యాలయాలకు రాధా స్టీల్ సిబ్బంది రాంగ్ కేటగిరేషన్ విద్యుత్ వాడకం నిజమేనని ఏఈ గుర్రం ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రెండు నెలల క్రితం విషయం తెలిసి, అక్రమ విద్యుత్ తీసుకునే వైర్లు తొలగించి మొదటి హెచ్చరించి వదిలేశామని తెలిపారు. ప్రధాన రహదారి వెంట కర్మగారం గోడను ఆనుకుని, గతంలో వీధి వ్యాపారం చేసుకునే యాజమాన్యాలు తీసుకున్న కమర్షియల్ మీటర్ల నుండి అక్రమంగా వైర్లు వేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్, ఏసీ, విద్యుత్ వాడకం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మీటర్ల యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలతో పాటు బ్యాక్ బిల్లింగ్ వేస్తామని తెలిపారు. 6 నెలలుగా రాంగ్ కేటగిరేషన్ విద్యుత్ ను అక్రమంగా వాడిన 'రాధా స్టీల్ యాజమాన్యం'పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు.


Similar News