పేరుకే మినరల్..అందులో అంతా జనరల్

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా మినరల్ వాటర్ హవా నడుస్తోంది. తాగే నీరు పైనే సగం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పొరపాటున తాగే నీరు కలుషితమైందో ఇక అంతే సంగతులు.

Update: 2024-09-21 02:20 GMT

దిశ, పరకాల : ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా మినరల్ వాటర్ హవా నడుస్తోంది. తాగే నీరు పైనే సగం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పొరపాటున తాగే నీరు కలుషితమైందో ఇక అంతే సంగతులు. రోగాల బారిన పడినట్టే. కానీ పేరుకు మినరల్ వాటర్ అని అమ్ముతూ.. అంతా కల్తీ మయంగా మార్చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పరకాల, నడికూడ పట్టణ మరియు గ్రామాల్లో వందకు పైగా వాటర్​ప్లాంట్‌లు ఉన్నాయి. చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరూ మినరల్ వాటర్ ఉపయోగిస్తున్నారు. పేరులోనే మినరల్ తప్ప నీటిలో ఉండదు. పేదవాడి నుంచి మధ్యతరగతి ప్రజలు మినరల్ వాటర్‌నే తాగుతున్నారు.

ఇదే అక్రమార్కులకు లాభసాటి నీరు వ్యాపారంగా మారింది. పెద్దగా పెట్టుబడి లేకుండా తక్కువ రోజుల్లోనే లక్షలు గడిస్తున్నారు. చాలామంది మినరల్ వాటర్ ప్లాంట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు ఐఎస్ఐ అనుమతి ఏ ఒక్కరికి లేదు. నిబంధనల ప్రకారం ఐఎస్ఐ అనుమతికి ప్రతి ఏటా రూ.వేలల్లో ఖర్చవుతుంది. దీనికి తోడు ప్రతినెలా ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ లలో వాటర్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. వాటర్ ప్లాంట్ లో ఆర్వో మిషనరీ తో పాటు కెమిస్ట్ మైక్రో బయాలజీ నుంచి నీటి పరీక్షలు ఓకే అయిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది. కానీ, నీటి పరీక్షలు నిర్వహించకుండా కొందరు అక్రమార్కులు నీటి వ్యాపారానికి తెరలేపుతున్నారు.

నేరుగా నీళ్లు పట్టి అమ్మడమే..

పరకాల, నడికూడ మండలాల్లో 5 నుంచి 6 మినహా మిగిలిన వాటర్ ప్లాంట్లన్నీ ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా నీటిని విక్రయిస్తున్నారు. కొందరైతే మంచినీటి బోర్లు వేసి వాటిని ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా నింపి అదే నీటిని క్యాన్లలో పట్టి విక్రయిస్తున్నారు. ప్లాంట్ యజమానులు ఇచ్చిన నీటిని వాటర్ బాటిల్ ద్వారా నింపి ఫ్రీజ్ లో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. లీటరు ధర రూ.5కు దుకాణాలు,పాన్ షాపులు, బజ్జీ కొట్లలో,వైన్ షాపుల పక్కన ప్రజలు కొనుగోలు చేసి తాగుతున్నారు. మండలాల నుంచి మొదలు గ్రామాల వరకు ఈ వ్యాపారం సాగుతోంది. ఒక వాటర్ క్యాన్ ధర రూ.10 నుంచి రూ.50 వరకు టాటా ఏస్ ​ఆటోలు, త్రీ వీలర్ ఆటోల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

క్యాన్లను శుభ్రం చేయకుండానే దాదాపు రోజుకూ వేల సంఖ్యలో క్యాన్లు అమ్ముడుపోవడం గమనార్హం. క్యాన్లలో నీరు ఎక్కువ సేపు నిల్వ ఉండడం ద్వారా బ్యాక్టీరియా చేరి ఫంగస్ కూడా వస్తుంది. కానీ ఇవేమి పట్టని వాటర్ ప్లాంట్ యజమానులు మినరల్ వాటర్ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఫ్యూరి ఫైర్​ చేయని నీరు తాగడం తో ముఖ్యంగా వైరల్ డిసీజెస్, గొంతు నొప్పి, డయేరియా వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, గ్రామ పరిపాలన అధికారులు చర్యలు చేపట్టి అనుమతి లేని వాటర్ ప్లాంట్లను మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News