ఇసుక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..!

Update: 2024-08-09 02:28 GMT

దిశ, మంగపేట: మండలంలోని చుంచుపల్లికి చెందిన ఇసుక క్వారీల్లో రేజింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, పాలకపక్షం రేజింగ్ ఇసుక కాంట్రాక్టర్లకు సహకరిస్తుండడంతో మంగపేట-బూర్గంపహాడ్ డబుల్ లేన్ ప్రధాన రహదారిని ఆక్రమించేస్తున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను గోదావరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై డంపింగ్ చేస్తున్నారు. నిత్యం వందలాది లారీల్లో లోడింగ్ చేస్తుండడంతో సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారిపై

వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో మండల ప్రజలకు ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది.

నిత్యం ట్రాఫిక్ సమస్య..

వందల లారీలను రోడ్డుపై కిలోమీటర్ల మేరకు నిలపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన రోగులు, విద్యార్థులు, సమయానికి విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. లోడ్ చేసిన లారీలను కొత్తమల్లూరు(బెస్తగూడెం) నుంచి రమణక్కపేట వరకు ఆరు కిలోమీటర్ల మేర నిలుపుతున్నారు. 6 కిలోమీటర్ల ప్రయాణం 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ అధికారుల బాధలు వర్ణణాతీతం..

హన్మకొండ నుంచి ఈ రహదారిపై బయ్యారం, మణుగూరు, ఖమ్మం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఉదయం 5 గంటల నుంచే ప్రయాణిస్తుంటాయి. రోడ్డుపై నిలిచే లారీలతో ట్రాఫిక్ సమస్య జటిలమై గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన

వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై అసంతృప్తి..

చుంచుపల్లి కేంద్రంగా 3 ఇసుక క్వారీల్లో రేజింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలకు సహకరిస్తున్న టీఎస్ఎండీసీ, జిల్లా అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో పాటు మండల పర్యటనకు వస్తున్న జిల్లా స్థాయి అధికారులకు సైతం ఈ వ్యవహారం తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

చుంచుపల్లి ఇసుక రేజింగ్ కాంట్రాక్టర్లు మంగపేట-బూర్గంపహాడ్ డబుల్ లేన్ రోడ్డుపై లారీలను పెట్టి ఇసుక లోడింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వారిపై శాఖా పరమైన చర్యలుతీసుకుంటాం. ప్రభుత్వ నిభందనల మేరకు ఇసుక డంపింగ్ రోడ్లవెంట చేయరాదు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే డంపింగ్ చేసిన ఇసుకను సీజ్ చేస్తాం. 3 ఇసుక క్వారీల వద్ద ఇద్దరు ప్రభుత్వ సాండ్ రీచ్ అసిస్టెంట్లను పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా నివారించడంలో విఫలమైన టీఎస్ఎండీసీ సాండ్ రీచ్ అసిస్టెంట్లపై కూడా చర్యలుంటాయి.

–శ్రీరాములు టీఎస్ఎండీసీ పీఓ

Tags:    

Similar News