Vijayashanthi: ఇది ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం.. లడ్డూ అంశంపై నటి విజయశాంతి

తిరుమల లడ్డూ వివాదం ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని, త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి అన్నారు.

Update: 2024-09-23 14:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ వివాదం ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని, త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై స్పందించిన విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. నాలుగు సంవత్సరాలుగా జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన ప్రసాదం భక్తి తత్పరతతో స్వీకరించినమన్న ఆలోచన భక్తులమెవ్వరం సహించలేమని అన్నారు. ఈ వార్త అసత్యం అయి తీరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే స్వామివారి దర్శనం చేసుకోనివారు కూడా లడ్డూ తిని, తిరుమల వెంకటేశ్వరుని అనుగ్రహం లభించినట్లు విశ్వసిస్తారని తెలిపారు. అలాంటి లడ్డూపై ఈ వివాదం కొనసాగుతున్న కొద్దీ భక్తుల మనోభావాలు మరింతగా దెబ్బతింటాయని చెప్పారు. అందువల్ల సాధ్యమైనంత త్వరలో వివాదానికి ముగింపు పలకాలని సూచించారు. ఇక ఈ సమస్యకు తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా పరిష్కారాన్ని కనుక్కోవడం చాలా అవసరమని, ఎందుకంటే, స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారన్న అపప్రద ఎదురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఏది ఏమైనా కోట్లాది హిందువుల మనోభావాలపై ఆందోళన సృష్టించే ఈ సున్నితమైన అంశానికి త్వరలో ముగింపు పలకాలని కోరుకుంటున్నానని విజయశాంతి ఎక్స్ లో రాసుకొచ్చారు.


Similar News