Minister : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి.. అధికారులతో మంత్రి దామోదర

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు.

Update: 2024-10-05 10:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుపై తాజాగా జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. సన్నాలను, దొడ్డు ధాన్యమును విడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సన్నాలకు 500 రూపాయల బోనస్‌ను అందించాలని తెలిపారు. జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరే వరకు అధికారులు బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని, ఇతర రాష్ట్రాల నుంచి సన్నరకం ధాన్యం రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అప్రమత్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతులకు 48 గంటల్లో వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, పోలీసులు, సహకార శాఖ, ఐకేపీ, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


Similar News