TS EAMCET : తెలంగాణ ఈఏపీసెట్.. ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి

దిశ, నేషనల్ బ్యూరో : తెలంగాణలో ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు బుధవారం పూర్తయిందని ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు.

Update: 2024-07-31 12:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తెలంగాణలో ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు బుధవారం పూర్తయిందని ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 86,509 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలుపుకొని 81,490 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. మరో 5,019 సీట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్​లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ 9,084 మంది విద్యార్థులు సీట్లు పొందలేకపోయారు.

రెండో రౌండ్‌లో సీట్ల కేటాయింపు ముగిసే సమయానికి రాష్ట్రంలోని దాదాపు 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉన్న 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. సీట్ల కేటాయింపు వివరాలను తెలుసుకునేందుకు విద్యార్థులు https://tgeapcet.nic.in/college_allotment.aspx వెబ్‌సైట్‌ను చూడొచ్చు. రెండో విడతకు ఎంపికైన వారు ట్యూషన్‌ ఫీజు పేమెంట్‌, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఆగస్టు 1 నుంచి 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాకే ఆయా కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంది.

Tags:    

Similar News