Traffic Jam: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు

నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు.

Update: 2024-09-16 03:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు (Ganesh Navaratri) పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలను నిమజ్జనం (Ganesh Immersion) చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ (Tank bund) చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు, ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవ్వడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఉదయం సమయం కావడంతో వాహనాలు ఓ క్రమంలో ముందుకు పంపేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా తెలుస్తోంది. భద్రతాపరంగా కొంత మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నప్పటికీ హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కనిపించపోవడం గమనార్హం.

కాగా, రేపు ఖైరతాబాద్‌ (Khairathabad) మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు తెలిపారు. గణేశ్ శోభాయాత్ర భద్రతకు 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఖైరతాబాద్‌ మహా గణపతికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నాం ఒంటి గంటలోపు నిమజ్జన క్రతువు పూర్తి కానుంది. 


Similar News