వైద్యారోగ్యశాఖలో గందరగోళం.. నివేదిక కోరిన సీఎం రేవంత్..!

వైద్యారోగ్యశాఖలోని సాధారణ బదిలీల్లో ఆందోళనకు గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఆరోగ్యశాఖలోనే ఎందుకు

Update: 2024-07-21 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలోని సాధారణ బదిలీల్లో ఆందోళనకు గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఆరోగ్యశాఖలోనే ఎందుకు ఈ హాడావిడి నెలకొన్నదని ఉన్నతాధికారులను అడిగారు. గందరగోళ పరిస్థితులపై నివేదిక కోరినట్లు తెలిసింది. జనరల్ ట్రాన్స్‌ఫర్ల ప్రాసెస్‌లో ఏ శాఖలో లేని ఆందోళనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని సీఎం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సీఎంకు వివరాలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు. జనరల్ ట్రాన్స్‌ఫర్ల తేదీలను పెంచడానికి కూడా తమశాఖనే కారణమైనదని వైద్యారోగ్యశాఖలోని ఓ ఆఫీసర్ తెలిపారు. వైద్యారోగ్యశాఖలోని పబ్లిక్ హెల్త్ విభాగంలో జరిగిన కౌన్సిలింగ్ దారుణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టాఫ్​నర్సుల సీనియారిటీ లిస్టును నాలుగు సార్లు రివైజ్డ్ చేసినా, తప్పులు తేలడం ఆయా అధికారుల నిర్లక్ష్యమేనని వివరించారు. డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) కేడర్‌లో కేవలం 13 మంది ఉండగా, వీరి బదిలీల్లోనూ రూల్స్‌కు విరుద్ధంగా జరిగినట్లు ప్రభుత్వం దృష్టిలో ఉన్నదన్నారు.

స్పౌజ్‌లు లేకున్నా, ఉన్నట్లు పరిగణించడం దారుణమన్నారు. పైగా జీవో నెం 80 ప్రకారం హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పని చేసినోళ్లను బదిలీ చేయాలని ఉన్నదని, డీడీ అడ్మిన్ కేడర్‌లోని ఇద్దరిని ఏకంగా హెడ్ ఆఫీస్‌కు ఎలా వేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరికీ స్పౌజ్ లేకున్నా, హైదరాబాద్‌లోనే ఉంచారన్నారు. ఓ యూనియన్, ఓ హెచ్వోడీ, ఓ డీడీ, స్టాఫ్​నర్సు అసోసియేషన్‌లోని కొందరు ఇలా అందరి ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లు అనుమానం ఉన్నదని, ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ తర్వాతనే బదిలీలు చేయాలని ఆయన కోరారు. అప్పటి వరకు కౌన్సిలింగ్‌లో ఇచ్చిన పోస్టింగ్‌లకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Similar News