యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Update: 2024-10-21 14:55 GMT

దిశ, గండిపేట్:- రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు ఇక్కడ విద్యను అందించనున్నారని తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం ఆలోచించించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన‌ట్లు వివ‌రించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ సర్కార్ అక్టోబర్ 21న సాయంత్రం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశామ‌ని తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ పోలీసు పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అన్ని ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉండనుందని, మొద‌టి విడతగా 5 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు ప్రారంభిస్తామని చెప్పారు. పోలీసులు చేసేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. తెలంగాణలోని పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్ పిఎఫ్ జైళ్లలో అమరవీరులు, ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో విద్య అందించనున్న‌ట్లు వివ‌రించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గత ప్రభుత్వం పోలీసులను త‌మ స్వార్థానికి ఉపయోగించుకున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని విమర్శించారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న పోలీసులకు అభినందనలు తెలిపారు.

భవిష్యత్తులో యువత శ్రేయస్సు కోసం మొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల్లో కులమతాల భేదం ఉండకూడదని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామ‌న్నారు. పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం ప‌దేళ్లలో చేసిందేమీ లేదని, తెలంగాణ వచ్చాక గ్రూప్ - 1 మెయిన్స్ నిర్వహిస్తున్నామ‌న్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 10 నెలలుగా ఓ విజన్ తో ముందుకెళ్తున్నామని శ్రీధర్ బాబు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి జితేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News