TGSRTC: ఆపరేషన్ దసరా.. పోలీస్, రవాణా శాఖ అధికారులతో సజ్జనార్ భేటీ

స‌ద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి స‌హ‌క‌రించాల‌ని, గ‌తంతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని పోలీస్, ర‌వాణా శాఖ‌ల అధికారుల‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ కోరారు.

Update: 2024-10-07 13:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స‌ద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి స‌హ‌క‌రించాల‌ని, గ‌తంతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని పోలీస్, ర‌వాణా శాఖ‌ల అధికారుల‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ కోరారు. ద‌సరా ఆప‌రేష‌న్స్‌పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైబ‌రాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయ‌ల్ డేవిస్, హైదరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు, ట్రాఫిక్ అదనపు డీసీపీలు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ మాట్లాడుతూ.. పండుగ స‌మ‌యాల్లో టీజీఎస్ఆర్టీసీకి పోలీస్, ర‌వాణా శాఖ‌లు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. సంస్థ వృద్దిలో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంద‌ని అన్నారు.

పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్రజ‌ల‌కు సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోందని తెలిపారు. ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తిప్పాల‌ని నిర్ణయించిందని, ఈ నెల 9 నుంచి 12 తేది వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతోందన్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియ‌మించామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని, ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియ‌మించామని సజ్జనార్ అన్నారు.

ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ప్లాన్ చేశామని, ముఖ్యంగా జేబీఎస్ నుంచి 1602, ఎల్బీన‌గ‌ర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘ‌ర్ నుంచి 451 అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 13, 14 వ తేదిల్లోనూ ప్రత్యేక బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఇక బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బ‌స్సుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించేందుకు గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. దీనిపై హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ వేళ‌ల్లో టీజీఎస్ఆర్టీసీకి త‌మ స‌హ‌కారం ఎప్పటికీ ఉంటుంద‌ని, ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చడానికి టీజీఎస్ఆర్టీసీతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.


Similar News