గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు వీధికెక్కింది. గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం రచ్చ కెక్కింది.

Update: 2024-10-13 13:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు వీధికెక్కింది. గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం రచ్చ కెక్కింది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ చేసిన ఆ ముగ్గురిని విడిచి పెట్టాలనే డిమాండ్‌తో ధర్మారం రైల్వే‌గేట్ వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయుల ధర్నాకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని గీసుకొండ సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

తన అనుచరుల అరెస్టును మంత్రి కొండా సురేఖ సీరియస్ గా తీసుకున్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ వెళ్లి సీఐ కుర్చీలో కూర్చోని మరో వివాదానికి ఆస్కారమిచ్చారు. సీఐని తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. వెంటనే తమ వారిని విడిచిపెట్టాలని మంత్రి సురేఖ కోరారు. కొండా సురేఖ వర్గీయులు ఈ సందర్భంగా పెద్దఎత్తున గీసుకొండ పోలీస్ స్టేషన్ ఎదుట మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.  


Similar News