మాట నిలబెట్టుకోండి సీఎం సారూ..!

తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన టీయూకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Update: 2024-09-09 03:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూనివర్సిటీలో ఉండాల్సిన సంఖ్య రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక పోవడంతో పలు కోర్సుల్లో విద్య కుంటుపడుతోంది. గత పదేళ్లుగా రెగ్యులర్ పోస్టుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఉన్నంతలో అకడమిక్ కన్సల్టెంట్ తో నెట్టుకొస్తున్నారు. గతం కన్నా యూనివర్సిటీలో కోర్సు సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం యూనివర్సిటీ 28 కోర్సులు కొనసాగుతున్నాయి. 152 రెగ్యులర్ పోస్టులకు గాను, కేవలం 60మంది మాత్రమే రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. మిగతా పోస్టులకు దాదాపు పదేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ సీఎంగా ఉన్న రెండు టర్మ్ లలో ఏ ఒక్కసారి కూడా పోస్టుల భర్తీ జరగలేదని యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెపుతున్నారు.

ఏడాదిన్నర కాలంగా ఇన్ చార్జ్ ల పాలనలోనే..

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన రవీందర్ తన పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో ఎన్నో సమస్యలు, ఆందోళనకు నిలయంగా యూనివర్శిటీ నిలిచింది. వీసీని లెక్కలేనన్ని సార్లు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల ఘెరావ్ చేశారు. వీసీ రవీందర్ తన హయాంలో యూనివర్శిటీలోని కొందరు బోధన, బోధనేతర సిబ్బందిని తమ ఏజెంట్లుగా నియమించుకుని వారిచేత నిరుద్యోగుల వద్ద లక్షలకు లక్షలు ముడుపులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. తనను వేధిస్తున్నారని వీసీ రవీందర్ ప్రజాప్రతినిధుల పై కూడా ఆరోపణలు చేసి పాలిటిక్స్ తో గోక్కున్నారు. యూనివర్శిటీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన వీసీ ఏ యూనివర్శిటీకి పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు అప్పటి నుంచి యూనివర్సిటీ ఇన్ చార్జి పాలనలోనే కొనసాగుతోంది.వీసీ గా రవీందర్ నియామకం జరగక ముందు కూడా వీసీ లేరు. ఏడాదిన్నర కాలంగా ఇన్ చార్జిలతోనే నెట్టుకొస్తోంది. రెగ్యులర్ వీసీ నియామకం జరిగితే తప్ప యూనివర్సిటీ పాలన గాడిలో పడేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెగ్యులర్ పోస్టులు లోపిస్తున్న జవాబుదారీతనం

యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర పోస్టుల్లో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అకడమిక్ కన్సల్టెంట్లను నియమించి వారితోనే నెట్టుకొస్తోంది. కానీ, రెగ్యులర్ ఉద్యోగుల్లో ఉన్నంత జవాబుదారీ తనం అకడమిక్ కన్సల్టెంట్లలో కనిపించడం లేదని యూనివర్శిటీ వర్గాలు చెపుతున్న మాట. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పోస్టులో కూడా ఎక్కువ కాలం ఇంచార్జి పాలనతోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తోంది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో పాలన గాడి తప్పి అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తంగా మారిందనే టాక్ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు చెపుతున్నారు. ఇక్కడ అకడమిక్ కన్సల్టెంట్లు, రెగ్యులర్ స్టాఫ్ అంటూ వర్గాలుగా ఏర్పడి విధుల నిర్వహణను కూడా గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీనియర్లు కొంత మంది అకడమిక్ కన్సల్టెంట్లతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తూ తరచూ యూనివర్సిటీలో తరచూ ఇబ్బంది వాతావరణం కలిగించే విధంగా చేస్తున్నారని, వీరికి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా సహకరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఇబ్బందులు

యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీ పోస్టు భర్తీ కాకపోవడం, తరచూ ఇంచార్జిలకే బాధ్యతలు అప్పజెప్పడంతో యూనివర్సిటీ పాలన ఆగమాగం అవుతోందని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. ఎంత బాగా పని చేద్దామని భావించినా తమకున్న పరిధిలో చేయలేకపోతున్నామని, ఇప్పటి వరకు ఇన్ చార్జి వీసీలుగా పని చేసిన వారు చెపుతున్నారు. వీటికి తోడు యూనివర్శిటీలోనా బోధన, బోధనేతర సిబ్బంది తో ఉన్న సమస్యలు, విద్యార్థి సంఘాల సమస్యలు వేటికవే అడ్డుకట్ట వేస్తున్నాయని కొందరు చెపుతున్నారు.

సీఎం రేవంత్ ప్రకటనతో చిగురించిన ఆశలు..

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో యూనివర్సిటీకి కొత్త రెగ్యులర్ వీసీ నియామకంతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యూనివర్శిటీలోని ప్రధాన విభాగాల్లో సాంక్షన్ పోస్టుల్లో సగం కూడా రెగ్యులర్ పోస్టుల భర్తీ లేదని, సగానికన్నా ఎక్కవే ఖాళీగా ఉన్నాయని సమాచారం. దీంతో విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక వేళ ప్రభుత్వం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీరుతుందనే ఆశాభావంతో విద్యార్ధులున్నారు. అదే జరిగితే టీయూ లో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశాలున్నాయి. బీఆర్‌‌ఎస్ పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ యూనివర్శిటీ కాంగ్రెస్ హయాంలో నైనా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందనే నమ్మకాన్ని యూనివర్సిటీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే జనవరిలోనే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై దృష్టి పెట్టి ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వీసీల ఎంపిక కోసం కమిటీని కూడా నియమించింది. మధ్యలో లోక్ సభ ఎన్నికలు రావడం, అసెంబ్లీ సమావేశాలు వెనువెంటనే ఉండటం వంటి కారణాలతో ఈ ప్రక్రియ కాస్తా వెనకబడి పోయింది. చాలా రోజుల తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియపై మాట్లాడటంతో మళ్లీ ఆశలు చిగురించాయి.


Similar News